ముంబై/న్యూఢిల్లీ, జనవరి 22: వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను కేంద్ర ప్రభుత్వం నూతన బడ్జెట్ను ప్రవేశపెట్టనుండటంతో ఆయా రంగాల నుంచి డిమాండ్లు, విజ్ఞప్తులు, ప్రతిపాదనలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే రత్నాలు-ఆభరణాల ఎగుమతి, ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) బంగారం, కట్ చేసిన-సానబెట్టిన వజ్రాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని కోరుతున్నది. బంగారం, వజ్రాలు, వెండి, రంగు రాళ్ల వంటి ముడి సరకుల దిగుమతులపైనే భారతీయ రత్నాలు, ఆభరణాల పరిశ్రమ ఆధారపడి ఉన్నదని, కాబట్టి అంతర్జాతీయ మార్కెట్లో ఈ రంగం నిలదొక్కుకోవాలంటే సుంకాల భారం తగ్గాల్సిన అవసరం ఉందంటున్నది. ఫిబ్రవరి 1న పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రకటించనున్నారు.
11 శాతం తగ్గాలి
ఆయా దేశాల నుంచి దిగుమతి చేసుకున్న విలువైన లోహాలపై ప్రస్తుతం 15 శాతం సుంకం పడుతున్నది. దాన్ని 4 శాతానికి దించాలని జీజేఈపీసీ విజ్ఞప్తి చేస్తున్నది. అలాగే కట్-పాలీష్డ్ డైమండ్స్పై కూడా 5 శాతం నుంచి 2.5 శాతానికి కస్టమ్స్ సుంకాన్ని తగ్గించాలని కోరుతున్నది. అధిక సుంకం వల్ల దేశీయ ఎగుమతులు తగ్గిపోతున్నాయని, ఉద్యోగ-ఉపాధి కల్పన కూడా పడిపోతున్నదని అవి పెరగాలంటే సుంకాల భారం దిగాలని చెప్తున్నది.
ముఖ్యంగా చైనా, థాయిలాండ్ వంటి దేశాల నుంచి గ్లోబల్ మార్కెట్లో నెలకొంటున్న పోటీలో నిలబడాలంటే సుంకాల తగ్గింపు ప్రధానమని జీజేఈపీసీ పేర్కొంటున్నది. కాగా, కునారిల్లుతున్న దేశీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా డైమండ్ ఎగుమతిదారులకు తిరిగి వెలుగుల్నిచ్చేలా డైమండ్ ఇంప్రెస్ట్ లైసెన్స్ను మళ్లీ తీసుకురావాలని కూడా ఈ సందర్భంగా కేంద్రానికి జీజేఈపీసీ సూచిస్తున్నది. అలాగే ఎన్నో ఏండ్లుగా డిమాండ్ చేస్తున్న స్పెషల్ నోటిఫైడ్ జోన్లలో ముడి వజ్రాల అమ్మకం ప్రతిపాదననూ అమల్లోకి తేవాలంటున్నది. భారత్-యూఏఈ సీఈపీఏ నుంచి ప్రయోజనాలను పెంచాలని, ‘రేట్స్ అండ్ ట్యాక్సెస్ రిఫండ్’ వంటి విధానాన్ని ఆచరణలో పెట్టాలని జీజేఈపీసీ చైర్మన్ విపుల్ షా కోరుతున్నారు.
పేపర్పై పెంచాలి..
విదేశాల నుంచి దేశంలోకి దిగుమతి అవుతున్న పేపర్ ఉత్పత్తులపై సుంకాన్ని 25 శాతానికి పెంచాలని భారతీయ పేపర్, పేపర్బోర్డ్ తయారీదారులు డిమాండ్ చేస్తున్నారు. దిగుమతి సుంకాలు తక్కువగా ఉండటం వల్ల దేశంలోకి ఆయా దేశాల నుంచి నాసిరకం ఉత్పత్తులు వస్తున్నాయని ఇండియన్ పేపర్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐపీఎంఏ) ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఈ క్రమంలోనే రాబోయే బడ్జెట్లో ప్రస్తుతం 10 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని 25 శాతానికి పెంచాలని కోరుతున్నది. ఈ ఆర్థిక సంవత్సరం (2023-24) ప్రథమార్ధం (ఏప్రిల్-సెప్టెంబర్)లో పేపర్, పేపర్బోర్డ్ దిగుమతులు 43 శాతం పెరిగాయని, అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2022-23) ఇదే సమయంలో 25 శాతం వృద్ధే ఉన్నట్టు ఐపీఎంఏ అధ్యక్షుడు పవన్ అగర్వాల్ గుర్తుచేస్తున్నారు. కాబట్టి దిగుమతి సుంకాలు పెరగాల్సిన అవసరం ఉందని, అప్పుడే దేశీయ పరిశ్రమ నిలబడుతుందని అంటున్నారు.
స్మార్ట్ఫోన్ విడిభాగాలపై..
దేశీయంగా స్మార్ట్ఫోన్ల తయారీలో వినియోగిస్తున్న విదేశీ విడిభాగాలపై రాబోయే బడ్జెట్లో దిగుమతి సుంకాన్ని తగ్గించవద్దంటూ గ్లోబల్ ట్రేడ్ రిసెర్చ్ ఇనిషియేటివ్ (జీటీఆర్ఐ) కోరుతున్నది. ప్రస్తుతం అమల్లో ఉన్న సుంకాలు సరైన విధంగానే ఉన్నాయని, ఈ సమయంలో సుంకాల తగ్గింపు.. స్థానిక తయారీదారులకు ఇబ్బందికరంగా మారుతుందని వివరిస్తున్నది. ఈ మేరకు సోమవారం ఓ నివేదికను జీటీఆర్ఐ విడుదల చేసింది. వేగంగా విస్తరిస్తున్న భారతీయ స్మార్ట్ఫోన్ మార్కెట్లో పరిశ్రమ వృద్ధి, దీర్ఘకాలిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోవాలని హితవు పలికింది.
‘ప్రస్తుతం భారత్లో తయారవుతున్న స్మార్ట్ఫోన్ల కోసం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఆయా ఎలక్ట్రానిక్ విడిభాగాలపై 7.5 శాతం నుంచి 10 శాతం వరకు సుంకాలు పడుతున్నాయి. వీటిని ఇలాగే కొనసాగించాలి. తగ్గిస్తే దేశీయ తయారీదారుల వ్యాపారం దెబ్బ తింటుంది’ అని జీటీఆర్ఐ తమ రిపోర్టులో పేర్కొన్నది. అయితే ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ).. మొబైల్ ఫోన్ విడిభాగాలపై దిగుమతి సుంకాలను తగ్గిస్తే దేశీయంగా స్మార్ట్ఫోన్ల ఉత్పత్తి 28 శాతం పెరిగి 82 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంటున్నది. స్వదేశీ తయారీకి, ఎగుమతులకూ ఉత్సాహాన్నిస్తుందని చెప్తున్నది.