న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఇండియా మరోసారి వాహన ధరలను పెంచడానికి సిద్ధమవుతున్నది. డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనపడుతుండటం, కమోడిటీ ఉత్పత్తుల ధరలు దూసుకుపోతుండటంతో కార్ల ధరలను పెంచాల్సి రావచ్చునని కంపెనీ ప్రెసిడెంట్, సీఈవో హర్దీప్ సింగ్ బ్రార్ సంకేతాలిచ్చారు. ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటి వరకు వాహన ధరలను మూడుసార్లు 5 శాతం వరకు పెంచిన విషయం తెలిసిందే. మరోసారి వచ్చే నెలలో ధరల పెంపు అనివార్యమని దేశీయ మార్కెట్లోకి నూతన బీఎంబ్ల్యూ 7 సిరీస్ మాడళ్లను విడుదల చేసిన అనంతరం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
గతేడాది జనవరి నుంచి ఇప్పటి వరకు రూపాయి విలువ 18 శాతం వరకు పతనమైన విషయం తెలిసిందే. ఈ మాడల్ పెట్రోల్, ఎలక్ట్రిక్ వెర్షన్లలో లభించనున్నది. ఈవీ మాడల్ను జర్మనీ నుంచి దిగుమతి చేసుకొని భారత్లో విక్రయిస్తుండగా, పెట్రోల్ మాడల్ మాత్రం చెన్నై ప్లాంట్లో తయారవుతున్నది. బీఎండబ్ల్యూ 740 ఎం స్పోర్ట్ మాడల్ ధర రూ.1.95 కోట్లు కాగా, బీఎండబ్ల్యూ ఐ7 ఈడ్రైవ్ 50 ఎక్స్డ్రైవ్ ఎం స్పోర్ట్ మాడల్ రూ.2.65 కోట్లకు లభించనున్నది. ఈ ధరలు న్యూఢిల్లీ షోరంనకు సంబంధించినవి.