న్యూఢిల్లీ, డిసెంబర్ 9: కాంపోజిట్ ఇన్సూరెన్స్ సంస్థల్ని (ఒకే కంపెనీ జీవిత, సాధారణ బీమా పాలసీల వ్యాపారం చేయడం) కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తున్న నేపథ్యంలో జీవిత బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లోకి నాలుగు ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలను విలీనం చేయవచ్చని పరిశ్రమ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
బీమా పరిశ్రమలో కంపోజిట్ ఇన్సూరెన్స్ కంపెనీలను అనుమతించేందుకు ఇన్సూరెన్స్ చట్టం 1938, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం 1999లలో వివిధ నిబంధనల్ని సవరించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు తీసుకొచ్చింది. కాంపోజిట్ ఇన్సూరర్లను అనుమతించడంతో పాటు వాటికి అవసరమైన కనిష్ట మూలధనాన్ని నిర్దేశించడం, పెట్టుబడి నిబంధనల్లో మార్పులు చేయడం, ఈ విభాగంలోకి వివిధ ఇన్సూరెన్స్ సంస్థల్ని అనుమతించడం వంటి అధికారాలను ఇన్సూరెన్స్ రెగ్యులేటర్కు కల్పించే చట్ట సవరణల్ని కేంద్రం ప్రతిపాదించింది.
వ్యూహాత్మక రంగాల్లో నాలుగు పీఎస్యూలు ఉండవచ్చని, వ్యూహాత్మకయేతర రంగాల్లోనైతే ఒక ప్రభుత్వ సంస్థే ఉంటుందని గతంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ ప్రకటన మేరకు ఎల్ఐసీలో నాలుగు ప్రభుత్వ రంగ నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలనూ విలీనం చేయవచ్చని పరిశ్రమ అధికారి ఒకరు సూచించారు.
ఎల్ఐసీలో విలీనం చేయాలన్న పరిశ్రమ నిపుణుల ఐడియాను నాలుగు ప్రభుత్వ సాధారణ బీమా కంపెనీలు-ఓరియంటల్ ఇన్సూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్, న్యూ ఇండియా అష్యూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ల ఉద్యోగులు ఆహ్వానించారు. పీఎస్యూ ఇన్సూరెన్స్ కంపెనీలను పటిష్టపర్చే ఏ చర్యలకైనా తాము మద్దతునిస్తామని జనరల్ ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ ఆల్ ఇండియా అసోసియేషన్ (జీఐఈఏఐఏ) ప్రధాన కార్యదర్శి త్రిలోక్ సింగ్ చెప్పారు.
కేంద్ర ప్రభుత్వానికి మరికొన్ని ఇతర బీమా కంపెనీలు కూడా ఉన్నాయి. అవి-రీఇన్సూరెన్స్ వ్యాపారం చేసే జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (జీఐసీ రీ), ఎగుమతుల్ని ఇన్సూర్ చేసే ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (ఈసీజీసీ), అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ. వీటిలో అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ సంస్థను తదుపరి ఎల్ఐసీలో విలీనం చేయవచ్చని పరిశ్రమ అధికారి సూచించారు. మూడు జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలు-ఓరియంటల్ ఇన్సూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇన్సూరెన్స్లను ఒక కంపెనీగా విలీనం చేయనున్నట్టు కొద్ది ఏండ్ల క్రితం ప్రభుత్వం ప్రకటించింది. అటుతర్వాత ఆ ప్రతిపాదనను రద్దుచేసుకుంది. ఒక జనరల్ బీమా సంస్థను ప్రైవేటుకు విక్రయించాలని గత బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు.