న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 : దేశ జీడీపీ వృద్ధిరేటు తగ్గుముఖం పట్టింది. పాత సిరీస్ను కాదని, కొత్త సిరీస్ను తెచ్చి లెక్కించినా.. భారతీయ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న నిస్తేజాన్ని దాచలేకపోయింది నరేంద్ర మోదీ సర్కార్. ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో ఆర్థిక ప్రగతి రేటు 7.8 శాతంగానే ఉన్నట్టు తేలింది మరి. అంతకుముందు త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)తో పోల్చితే 0.6 శాతం పడిపోయింది. నాడు 8.4 శాతంగా ఉన్నది. శుక్రవారం కేంద్ర గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ.. 2022-23 బేస్ ఇయర్ (ఆధారిత సంవత్సరం)తో నూతన వార్షిక, త్రైమాసిక జాతీయ పద్దు అంచనాల సిరీస్ను విడుదల చేసింది. ఇప్పటిదాకా ఉన్న 2011-12 బేస్ ఇయర్ జీడీపీ గణన సిరీస్ స్థానంలో దీన్ని తీసుకొచ్చింది. కాగా, జీడీపీ గణనకు బేస్ ఇయర్లను ఇలా సవరించడం ఇది తొమ్మిదోసారి.
కొత్త సిరీస్తో దేశ జీడీపీ లెక్కింపు పద్ధతిని కేంద్రం సవరించింది. బేస్ ఇయర్ను మార్చడమేగాక, దేశంలోని ఆర్థిక కార్యకలాపాలన్నీ ప్రతిబింబించేలా వస్తు, సేవల పన్ను (జీఎస్టీ), ఈ-వాహన్ పోర్టల్ల డాటానూ జీడీపీ గణనకు అనుసంధానం చేశారు. ఇంతకుముందు జీఎస్టీ, ఈ-వాహన్ పోర్టల్ డాటా.. జీడీపీ లెక్కింపు పరిధిలోకి వచ్చేది కాదు. ఇదిలావుంటే కొత్త సిరీస్ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం జీడీపీ గణాంకాలను కేంద్రం సవరించింది. పాత సిరీస్ ప్రకారం 8.2 శాతంగా ఉంటే.. ఇప్పుడది 8.4 శాతానికి పెరిగింది. దీంతో చూస్తే.. అక్టోబర్-డిసెంబర్ జీడీపీ వృద్ధిరేటు 0.6 శాతం పడిపోయి 7.8 శాతానికే పరిమితమైంది. అయితే గత ఆర్థిక సంవత్సరం (2024-25) అక్టోబర్-డిసెంబర్తో పోల్చితే మాత్రం పెరిగింది. అప్పుడు 7.4 శాతంగా ఉన్నది. ఇక ఈసారి తయారీ, సేవా రంగాల్లో వృద్ధి కనిపించినట్టు కేంద్రం చెప్తున్నది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశ జీడీపీ వృద్ధిరేటు 7.6 శాతంగా నమోదు కావచ్చని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. పాత సిరీస్లో ఈ అంచనా 7.4 శాతంగానే ఉన్నది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 7.1 శాతంగా నమోదైన సంగతి విదితమే. కాగా, జీడీపీ గణనలో బేస్ ఇయర్ మార్పుతో దేశంలోని ఆర్థిక కార్యకలాపాల అసలు విలువ మరింత స్పష్టంగా తెలుస్తుందని మోదీ సర్కార్ భావిస్తున్నది. అందుకే మొత్తం ఆర్థిక సంవత్సరం జీడీపీ అంచనాను పెంచింది. ఇక ఈ 2025-26లో దేశ జీడీపీ విలువ రూ.322.58 లక్షల కోట్లుగా ఉండొచ్చని అంచనా. 2024-25లో రూ.299.89 లక్షల కోట్లుగా ఉన్నట్టు కేంద్ర గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ చెప్తున్నది.
వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) దేశ జీడీపీ వృద్ధిరేటు 7-7.4 శాతంగా ఉండొచ్చని ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ అంచనా వేశారు. అయితే గత నెల జనవరిలో కేంద్ర బడ్జెట్కు ముందు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో మాత్రం ఈ అంచనా 6.8-7.2 శాతంగానే ఉన్నది. జీడీపీ గణనకు కొత్త సిరీస్ విడుదలైన నేపథ్యంలో ఇదిప్పుడు ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నది. కాగా, దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 4 లక్షల కోట్ల డాలర్ల మార్కును కూడా దాటగలదన్న విశ్వాసాన్ని కొత్త సిరీస్ ప్రకటన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వ్యక్తం చేశారు.