న్యూఢిల్లీ, మే 18: ఆకాశాన్నంటుతున్న ద్రవ్యోల్బ ణం కారణంగా భారత్ వృద్ధి రేటు అంచనాల్ని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ రేటును 7.3 శాతానికి కుదిస్తున్నట్టు ఎస్ అండ్ పీ బుధవారం తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి భారత్ 7.8 శాతం వృద్ధిసాధిస్తుందని గత డిసెంబర్ నెలలో అంచనా వేసింది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ఎక్కువకాలం కొనసాగే అవకాశాలున్నందున, ద్రవ్యోల్బణం సైతం దీర్ఘకాలంపాటు గరిష్ఠస్థాయిలోనే కొనసాగుతుందని రేటింగ్ ఏజెన్సీ తెలిపింది. దీంతో వివిధ దేశాల కేంద్ర బ్యాంక్లు వడ్డీ రేట్లను మరింతగా పెంచుతాయని, ఉత్పత్తి, ఉపాధి దెబ్బతింటుందని, ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాల్ని 7.3 శాతానికి తగ్గిస్తున్నట్టు ఎస్ అండ్ పీ వివరించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి 6.5 శాతం వృద్ధిని అంచనా వేసింది. అలాగే 2022-23 ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.9 శాతం ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ తెలిపింది.
దేశంలో పడగవిప్పిన ద్రవ్యోల్బణంతో పలు అంతర్జాతీయ సంస్థలు జీడీపీ వృద్ధి రేటు అంచనాల్ని వరుసపెట్టి తగ్గిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 8.7 శాతం నుంచి 8 శాతానికి కోత విధిస్తున్నట్టు ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. ఐఎంఎఫ్ 9 శాతం నుంచి 8.2 శాతానికి, ఏడీబీ 7.5 శాతానికే పరిమిత మవుతుందని వెల్లడించింది. ఇక ఆర్బీఐ 7.2 శాతానికి కుదించింది.