‘తన కంపెనీలపై వచ్చిన ఆరోపణలను గౌతమ్ అదానీ స్వదేశం భారత్లోనైతే ఏదోవిధంగా మేనేజ్చేసుకొనేవారు. అయితే అమెరికన్ రీసెర్చ్ సంస్థ ‘హిండెన్బర్గ్’ రిపోర్ట్లో పేర్కొన్న విషయాలు ఇండియాకే పరిమితం కాలేదు.
అందుకే ఆ నివేదిక అదానీ సామ్రాజ్య పునాదులను కదిలిస్తున్నది. ప్రధాని మోదీతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఇంతకాలం దేశీయంగా వచ్చిన విమర్శలు అదానీ వ్యాపారానికి ఎలాంటి అడ్డంకులను సృష్టించలేదని అంటున్నారు. కానీ, ఇప్పుడు గ్లోబల్ ప్లాట్ఫాంపై అవేమీ కుదరట్లేదు’& బ్లూమ్బర్గ్ చేసిన తాజా వ్యాఖ్యానం అక్షర సత్యం.
అదానీ గ్రూప్ వ్యవహారం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. అందుకే రాజకీయ అండదండలు మెండుగా ఉన్న అదానీ గ్రూప్ను దేశీయ దర్యాప్తు సంస్థలు నిలదీయనప్పటికీ.. అంతర్జాతీయంగా మాత్రం పలు రేటింగ్ ఏజెన్సీలు, గ్లోబల్ కంపెనీలు కర్రుకాల్చి వాత పెడుతున్నాయి.
దేశంలో తయారీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసమంటూ ప్రధాని మోదీ తీసుకొచ్చిన ‘మేకిన్ ఇండియా’ పథకానికి అదానీ పిల్లర్గా మారారు. అదానీ గుజరాత్కు చెందినవారు. అలాగే ప్రధాని మోదీ కూడా అక్కడివారే. 2000వ సంవత్సరం నుంచే వీళ్లిద్దరూ ఎంతో సన్నిహితంగా ఉంటున్నారు. మోదీ దేనిపై ఆసక్తి కనబరుస్తారో.. ఆ రంగంలోకి అదానీ ప్రవేశిస్తారు.
-బ్లూమ్బర్గ్ బిజినెస్వీక్ మ్యాగజైన్
‘ముంద్రా పోర్టులోని ఓ చిన్న ఎయిర్స్ట్రిప్ను నిర్వహించడానికే ఆపసోపాలు పడిన అదానీ కంపెనీకి దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ఏడు విమానాశ్రయాలను కేంద్రం అప్పనంగా కట్టబెట్టింది. దీనికోసం ఏకంగా నిబంధనలు మార్చేసింది. అదానీ గ్రూప్పై నరేంద్ర మోదీ సర్కార్కు ఉన్న ఎనలేని ప్రేమకు ఇదే నిదర్శనం’
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): హిండెన్బర్గ్ సంచలనాత్మక కథనంతో అదానీ గ్రూప్ పునాదులు కదులుతున్నాయి. మిత్రుడికి ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చేందుకు ప్రధాని మోదీ జాతి సంపదను యథేచ్ఛగా దోచిపెట్టారంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలతో పార్లమెంట్ దద్దరిల్లుతున్నది. అయితే అదానీ ఉదంతాన్ని చిన్న విషయంగా చూపెట్టి మభ్యపెట్టేందుకు కేంద్రం ఎన్నో అగచాట్లు పడుతున్నది. అదానీ షేర్ల పతనంతో ఎల్ఐసీ, ప్రభుత్వ బ్యాంకులకు వచ్చిన నష్టమేమీలేదంటూ ప్రకటనలు గుప్పిస్తున్నది. అదానీ వంటి ఒక్క ఉదంతం వల్ల దేశీయ మార్కెట్లపై ఎలాంటి ప్రభావం ఉండబోదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
బ్యాంకింగ్ రంగం భద్రంగానే ఉన్నదంటూ రిజర్వ్ బ్యాంక్ ప్రకటన చేసింది. అదానీ గ్రూప్ షేర్ల వల్ల మార్కెట్పై పడుతున్న ప్రభావాన్ని ‘టీ కప్పులో తుపాను’గానే చూడాలంటూ ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ చెప్పుకొచ్చారు. అయితే వీటిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హిండెన్బర్గ్ రిపోర్ట్ నేపథ్యంలో రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరైందని, ఇదంతా ప్రజల సొత్తు కాదా? అంటూ సోషల్మీడియాలో పలువురు కేంద్రం వైఖరిపై దుమ్మెత్తిపోస్తున్నారు. మోదీ ఆప్తమిత్రుడైన అదానీ కంపెనీలపై దర్యాప్తు చేయడానికి సెబీ తదితర ఏజెన్సీలు మీనమేషాలు లెక్కిస్తున్నప్పటికీ.. అంతర్జాతీయ సంస్థలు దూకుడుగానే ఉన్నాయి. గడిచిన రెండు వారాల్లో గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీలు, సంస్థలు అదానీ కంపెనీల రేటింగ్స్ను తగ్గించడం, ఒప్పందాలను రద్దు చేసుకోవడమే ఇందుకు నిదర్శనం.
ప్రస్తుత పరిస్థితుల్లో అదానీ పోర్ట్స్, అదానీ ఎలక్ట్రిసిటీలకు ప్రతికూల రేటింగ్ ఇస్తున్నాం.
– ప్రఖ్యాత స్టాక్ మార్కెట్
ఇండెక్స్ ఎస్ఎండ్పీ
నాలుగు అదానీ గ్రూప్ కంపెనీల ఫ్రీ ఫ్లోట్స్ను (అంతర్జాతీయ ఇన్వెస్టర్లు ట్రేడ్ చేసేందుకు అందుబాటులో ఉన్న షేర్ల పరిమాణం) తగ్గిస్తున్నాం.
-గ్లోబల్ ఇండెక్స్ ప్రొవైడర్ మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్
అదానీకి చెందిన టోటల్ గ్యాస్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, అదానీ గ్రీన్ ఎనర్జీ నుంచి రూ.18 వేల కోట్ల విలువైన పెట్టుబడులను ఉపసంహరించుకొంటున్నాం.
-నార్వే వెల్త్ ఫండ్
అదానీ గ్రూప్ ప్రతిపాదించిన 50 బిలియన్ డాలర్ల హైడ్రోజన్ ప్రాజెక్టులో భాగస్వామ్యం తీసుకోవాలన్న నిర్ణయాన్ని ప్రస్తుతానికి నిలిపేస్తున్నాం.
-ఫ్రాన్స్ సంస్థ టోటల్ ఎనర్జీస్
అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ నివేదికను సమీక్షిస్తున్నాం.
-ఆస్ట్రేలియన్ సెక్యూరిటీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కమిషన్
అదానీ గ్రూప్, దానితో సత్సంబంధాలు ఉన్న ఎలారా క్యాపిటల్ సంస్థలపై దర్యాప్తునకు ఆదేశించాం.
-ఫైనాన్షియల్ కండక్ట్ అథారిటీ (ఎఫ్సీఏ), యూకే
అదానీ ఉదంతంతో భారత్లో పెట్టుబడులు పెట్టాలనుకొన్న విదేశీ ఇన్వెస్టర్లు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. కేంద్రం, కార్పొరేట్ రంగంలో పారదర్శకత, బంధుప్రీతి, రుణాలు కూడా ఇందుకు దోహదం చేస్తున్నాయి.
-గ్యారీ డుగాన్, సీఈవో, గ్లోబల్ సీఐవో ఆఫీస్, సింగపూర్