Gautham Adani | అదానీ గ్రూప్ వ్యవస్థాపక చైర్మన్ గౌతం అదానీ వ్యక్తిగత సంపద పెంచుకోవడంలో వడివడిగా ముందుకు సాగుతున్నారు. ఇంధనం నుంచి నౌకాశ్రయాలు, గనులు, వంట నూనెలు తదితర రంగాల్లో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న గౌతం అదానీ ఇప్పుడు ప్రపంచ కుబేరుల జాబితాలో ఆరో స్థానాన్ని పొందారు. టాప్-10 బిలియనీర్స్లో చోటు దక్కించుకున్న తొలి భారత్ కార్పొరేట్ సంస్థ అధినేత గౌతం అదానీ. ఆయన వ్యక్తిగత సంపద 118 బిలియన్ డాలర్లకు చేరుకున్నది.
స్టాక్మార్కెట్లలో అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీల షేర్లు భారీగా లబ్ధి పొందడంతో ఆయన వ్యక్తిగత సంపద శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. సోమవారం ప్రత్యేకించి అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ గ్యాస్, అదానీ ట్రాన్స్మిషన్ షేర్లు పైపైకి దూసుకెళ్లడంతో గౌతం అదానీ వ్యక్తిగత సంపద రూ.65,091 కోట్ల (8.57 బిలియన్ల డాలర్లు)కు చేరుకుంది. మొత్తం స్టాక్స్ నష్టపోయినా అదానీ గ్రూప్ స్క్రిప్ట్లు 16 శాతానికి పైగా లాభపడ్డాయి.
దీంతో ఇప్పటివరకు భారత్-ఆసియా కుబేరుడిగా ఉన్న రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ వ్యక్తిగత సంపద కంటే 20.6 బిలియన్ డాలర్లు ఎక్కువ. ముకేశ్ అంబానీ వ్యక్తిగత సంపద 97.4 బిలియన్ల డాలర్లు. సెర్చింజన్ గూగుల్ వ్యవస్థాపకులు ల్యారీ పేజ్, సెర్జెయ్ బ్రిన్లనూ గౌతం అదానీ దాటేశారు. అదానీ కంటే ముందు టెస్లా సీఈవో ఎలన్మస్క్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, బెర్క్షైర్ హాత్వే చీఫ్ వారెన్ బఫెట్, ఎల్వీఎంహెచ్సీఈఓ బెర్నార్డ్ అర్నాల్ట్, మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్గేట్స్ను గౌతం అదానీ దాటేశారు.
ఈ ఏడాదిలో గౌతం అదానీ వ్యక్తిగత సంపద 41.6 డాలర్లు పెరిగింది. ప్రపంచంలోకెల్లా అత్యధిక సంపద కూడబెట్టిన బిలియనీర్గా నిలిచారు. గత 10 ఏండ్లలో ముకేశ్ అంబానీ వ్యక్తిగత సంపద 400 శాతం పెరిగితే, అదానీ వ్యక్తిగత సంపద 1830 శాతం పెరిగిందని 2022 ఎం3ఎం హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ తెలిపింది.