ముంబై, ఆగస్టు 25: వరుస టేకోవర్లు జరుపుతున్న గౌతమ్ అదానీ గ్రూప్ను అంతర్జాతీయ రేటింగ్స్ దిగ్గజం ఎస్అండ్పీ తీవ్రంగా హెచ్చరించింది. అదానీ గ్రూప్లోని రేటెడ్ కంపెనీల ఫండమెంటల్స్ ప్రస్తుతం పటిష్టంగా ఉన్నప్పటికీ, రుణాలు సేకరించి భవిష్యత్తులో జరిపే కొనుగోళ్ల కారణంగా వాటి రేటింగ్స్పై ఒత్తిడి ఏర్పడుతుందన్నది. ఇప్పటికే క్రెడిట్సైట్స్ కూడా ఇదేతరహా ఆందోళనను వ్యక్తం చేసిస సంగతి తెలిసిందే. 1988లో కమోడిటీ ట్రేడింగ్తో కార్యకలాపాలు ప్రారంభించిన అదానీ గ్రూప్.. గనులు, రేవులు, విద్యుత్ ప్లాంట్లు, విమానాశ్రయాలు, డాటా సెంటర్లు, రక్షణ రంగాల్లోకి విస్తరించింది.
ఇటీవల 10.5 బిలియన్ డాలర్లతో సిమెంటు కంపెనీలైన అంబూజా, ఏసీసీలను కొనుగోలు చేసింది. అలాగే ఈ గ్రూప్ ఒక అల్యూమినా ఫ్యాక్టరీని కూడా నెలకొల్పుతున్నది. ఈ కొనుగోళ్లు, విస్తరణ కార్యకలాపాలకు నిధుల్ని చాలావరకూ రుణాల ద్వారానే అదానీ గ్రూప్ సమకూర్చుకుంటున్నది.
అదానీ గ్రూప్ కంపెనీల్లో చాలావరకూ టేకోవర్ల ద్వారానే విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో అదానీ పోర్ట్స్ బిజినెస్ ఫండమెంటల్స్ బాగున్నాయని, నగదు రాబడులు కూడా మెరుగ్గా ఉన్నాయని, అయితే ఈ గ్రూప్ కొంటున్న కొన్ని కంపెనీల ద్వారా రిస్క్ ఏర్పడుతున్నదని ఎస్అండ్పీ హెచ్చరిస్తున్నది. కాగా, సిమెంట్, డాటా వేర్హౌజింగ్, ఎయిర్పోర్టులు తదితర అన్రేటెడ్ విభాగాల్లోకి అదానీ గ్రూప్ విస్తరిస్తున్నదన్నది.
ఎన్డీటీవీని అదానీ గ్రూప్ టేకోవర్ చేయాలంటే మార్కెట్ నియంత్రణా సంస్థ సెబీ అనుమతి కీలకం కానుంది. తమ ప్రమోటింగ్ సంస్థ ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్ తీసుకున్న రుణానికి బదులుగా ఆ సంస్థ వాటాను అదానీ గ్రూప్ కంపెనీ విశ్వప్రధాన్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ స్వాధీనం చేసుకోవాలంటే సెబీ అనుమతి ‘తప్పనిసరి’ అని ఎన్డీటీవీ తాజాగా స్టాక్ ఎక్సేంజీలకు సమాచారమిచ్చింది. ఎన్డీటీవీ వ్యవస్థాపక ప్రమోటర్లు ప్రణయ్రాయ్, రాధికారాయ్లు సెక్యూరిటీస్ మార్కెట్లో 2020 నవంబర్ 27 నుంచి ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించకూడదంటూ సెబీ నిషేధం విధించింది.
వారివురూ రెండేండ్లపాటు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా షేర్లను అమ్మడం, కొనడం, ఇతర సెక్యూరిటీస్ మార్కెట్ కార్యకలాపాలు నిర్వహించకుండా నిషేధించింది. ఈ నిషేధం గడువు ఈ నవంబర్ 26తో ముగుస్తుందని, ఈ కారణంగా తమ ప్రమోటింగ్ సంస్థలో 99.5 శాతం వాటాను తద్వారా ఎన్డీటీవీలో ఆర్ఆర్పీఆర్కు ఉన్న 29.18 శాతం వాటాను పొందడానికి సెబీ అనుమతి తప్పనిసరని ఎన్డీటీవీ తెలిపింది.