Adani Enters Media | ఆసియా కుబేరుడు.. ప్రధాని నరేంద్రమోదీకి అత్యంత సన్నిహితుడు గౌతం అదానీ.. ఇప్పటికే పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రోడ్లు, బొగ్గు, రిటైల్ నుంచి సిమెంట్ రంగంలోకి ఎంటరయ్యాడు. తాజాగా మీడియా రంగంలోనూ అడుగు పెట్టాడు. క్వింటిల్లియాన్ బిజినెస్ మీడియా లిమిటెడ్ సంస్థలో 49 శాతం వాటాను గౌతం అదానీ కొనుగోలు చేయనున్నాడు. ఈ మేరకు క్వింటిల్లియాన్ మీడియా లిమిటెడ్ (క్యూఎంఎల్), క్యూబీఎంఎల్తో అదానీ ఎంటర్ ప్రైజెస్ వాటాదారుల ఒప్పందం కుదుర్చుకున్నది. క్యూబీఎంఎల్లో ప్రతిపాదిత 49 శాతం వాటాల కొనుగోలు కోసం క్యూఎంఎల్, క్యూబీఎంఎల్, క్వింట్ డిజిటల్ మీడియా లిమిటెడ్ (క్యూడీఎంఎల్) సంస్థలతో వాటాల కొనుగోలు ఒప్పందం జరిగింది. ఈ విషయాన్ని గత 13 అర్ధరాత్రి పొద్దుపోయిన తర్వాత రెగ్యులేటరీ ఫైలింగ్లో అదానీ ఎంటర్ప్రైజెస్ తెలిపింది.
అదానీ ఎంటర్ప్రైజెస్ అనుబంధ ఏఎంజీ మీడియా నెట్వర్క్స్ లిమిటెడ్కు వాటాల విక్రయ ఒప్పందం కుదిరిందని క్వింట్ డిజిటల్ మీడియా లిమిటెడ్ ధృవీకరించింది. గత మార్చి ఒకటో తేదీన ఏఎంజీ మీడియా నెట్వర్క్స్ లిమిటెడ్తో తమ అనుబంధ క్వింటిల్లియాన్ మీడియా లిమిటెడ్, క్వింటిల్లియాన్ బిజినెస్ మీడియా లిమిటెడ్ సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. క్వింటిల్లియాన్ బిజినెస్ మీడియా లిమిటెడ్లో 49 శాతం వాటాల ఉపసంహరణకు ఈ ఒప్పందాలు కుదిరాయి.
రాఘవ్ బహల్ స్థాపింంచిన డిజిటల్ ప్లాట్పామ్ బ్లూంబర్గ్ క్వింట్ను క్యూబీఎంఎల్ నిర్వహిస్తున్నది. క్యూబీఎంఎల్లో మైనారిటీ వాటాను టేకోవర్ చేయడానికి క్వింట్తో మార్చిలో కుదిరిన ఒప్పందాన్ని అదానీ ఎంటర్ప్రైజెస్ గుర్తు చేసుకుంది. పబ్లిషింగ్, అడ్వర్టైజింగ్, బ్రాడ్కాస్టింగ్, వివిధ రకాల మీడియా నెట్వర్క్లకు కంటెంట్ పంపిణీ బిజినెస్లు నడుపాలన్న లక్ష్యంతో ఏఎంజీ మీడియా నెట్వర్క్స్ను అదానీ ఎంటర్ప్రైజెస్ గత నెలలో స్థాపించింది. అదానీ మీడియా నెట్వర్క్స్కు సీనియర్ జర్నలిస్టు సంజయ్ పుగాలియా సారధ్యం వహిస్తున్నారు.