Gautam Adani | యూఎస్ షార్ట్ షెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చి నివేదిక వెల్లడైన తర్వాత అదానీ గ్రూప్.. దాని అధినేత గౌతం అదానీ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతున్నది. జనవరి 24కి ముందు ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్న గౌతం అదానీ.. సరిగ్గా నెల తిరిగే సరికి ప్రపంచకుబేరుల జాబితాలో 30 స్థానానికి పడిపోయారు.
స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్లో అవకతవకలకు పాల్పడ్డారని, అకౌంటింగ్లో మోసాలు ఉన్నాయని హిండెన్ బర్గ్ చేసిన విమర్శలతో అదానీ గ్రూప్ సంస్థలు మార్కెట్ క్యాపిటలైజేషన్ నష్టపోవడమే కాదు.. దేశీయ స్టాక్ మార్కెట్లపైనా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. హిండెన్బర్గ్ ఆరోపణలు నిరాధారం, ద్వేషపూరితం అని అదానీ గ్రూప్ ఆరోపించింది. కానీ అదానీ గ్రూప్ సంస్థల నష్టాలు ఆగలేదు.. ఇప్పటి వరకు అదానీ గ్రూప్ లోని 10 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.12 లక్షల కోట్లు ఆవిరై పోయిందని గణాంకాలు చెబుతున్నాయి.
ఫ్రాన్స్తో కలిసి జాయింట్గా నిర్వహిస్తున్న అదానీ గ్యాస్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 80.68 శాతం నష్టపోయింది. అదానీ గ్రీన్ ఎనర్జీ 74.62 శాతం పతనమైంది. గత నెల 24 నుంచి ఇప్పటి వరకు అదానీ ట్రాన్స్ మిషన్ స్టాక్ 74.21 శాతం మేర కోల్పోయింది. అదానీ పవర్, అదానీ విల్మార్, అంబుజా సిమెంట్స్, ఏసీసీ సిమెంట్స్, ఎన్డీటీవీ, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ గణనీయ స్థాయిలో పతనమైంది.
ఇక హిండెన్బర్గ్ నివేదిక వెల్లడికి ముందు గౌతం అదానీ వ్యక్తిగత సంపద 120 బిలియన్ డాలర్లు. ఇప్పుడు ఆయన వ్యక్తిగత సంపద 80.6 బిలియన్ డాలర్లు కోల్పోయారు. ప్రపంచ బిలియనీర్ల జాబితాలో 30వ ర్యాంకుకు పరిమితమయ్యారు. వ్యాపార రంగంలో గౌతం అదానీకి ప్రధాన పోటీదారుగా ఉన్న ముకేశ్ అంబానీ ప్రస్తుతం ఆసియాలోనే మూడో అత్యంత కుబేరుడిగా కొనసాగుతుండగా, వరల్డ్ టాప్-10 బిలియనీర్ల జాబితాలో 10వ స్థానంలో ఉన్నారు. ముకేశ్ అంబానీ వ్యక్తిగత సంపద 81.7 బిలియన్ డాలర్లు
పోర్ట్స్, ఎయిర్ పోర్ట్స్, వంట నూనెలు, కమొడిటీస్, విద్యుత్, సిమెంట్, డేటా సెంటర్లతోపాటు గ్రీన్ ఎనర్జీ తదితర రంగాల్లోకి అదానీ వ్యాపార సామ్రాజ్యం విస్తరించింది. ఈ పరిస్థితులు అమెరికాలో 2001లో బయటపడ్డ ఎన్ రాన్ కుంభకోణం తరహాలో ఉన్నాయని హార్వర్డ్ యూనివర్సిటీ మాజీ ప్రెసిడెంట్ లారీ సమర్స్ పేర్కొన్నారు. దీనివల్ల భారత్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడవచ్చునన్నారు.