న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: వచ్చే దశాబ్దానికిపైగా కాలంలో 100 బిలియన్ డాలర్ల (రూ.8 లక్షల కోట్లు) పెట్టుబడులను అదానీ గ్రూప్ పెట్టనున్నది. ప్రధానంగా న్యూ ఎనర్జీ, డాటా సెంటర్ల వంటి డిజిటల్ విభాగంలోకి ఇందులో 70 శాతం పెట్టుబడులు వెళ్తాయని మంగళవారం సింగపూర్లో జరిగిన ఫోర్బ్స్ గ్లోబల్ సీఈవోల సదస్సులో మాట్లాడుతూ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తెలిపారు. కాగా, హైబ్రిడ్ పునరుత్పాదక శక్తి ఉత్పాదక సామర్థ్యాన్ని 45 గిగావాట్లు పెంచుకోవాలని అదానీ గ్రూప్ చూస్తున్నది. అలాగే సోలార్ ప్యానెళ్లు, విండ్ టర్బైన్లు, హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్ల తయారీకి 3 గిగా ఫ్యాక్టరీల నిర్మాణానికీ అదానీ ప్రయత్నిస్తున్నారు. 1988లో వ్యాపార రంగ ప్రవేశం చేసిన అదానీ.. ఇప్పుడు 143 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే మూడో అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు. ఓడరేవులు, విమానాశ్రయాలు, గ్రీన్ ఎనర్జీ, సిమెంట్, డాటా సెంటర్లు తదితర వ్యాపారాల్లో ఉన్న అదానీ గ్రూప్లోని స్టాక్ మార్కెట్ నమోదిత సంస్థల విలువ 260 బిలియన్ డాలర్లుగా ఉన్నది. ఇదిలావుంటే ప్రపంచీకరణ, ఆయా దేశాల్లో స్థానికంగా తయారీకి పెరుగుతున్న ప్రాధాన్యత, సరఫరా-టెక్నాలజీలపై ఆంక్షల నేపథ్యంలో చైనా ఒంటరైపోతున్నదని అదానీ అన్నారు. వివిధ గ్లోబల్ సంస్థలతో ఉత్పాదక రంగంలో కొనసాగిన చైనా హవాకు ఇప్పుడు బ్రేకులు పడుతున్నాయని ఈ సందర్భంగా అదానీ వ్యాఖ్యానించారు.