న్యూఢిల్లీ: భారత స్టాక్ మార్కెట్లు భారీగా పతనం కావడంతో అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ సంపద పెద్దఎత్తున ఆవిరైంది. దాంతో ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితాలో రెండో స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయారు. అంతర్జాతీయ ఈ-కామర్స్ కంపెనీ లూయిస్ వుయిట్టన్ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్ మూడో స్థానం నుంచి రెండో స్థానానికి చేరుకున్నారు.
అదానీ, ఆర్నాల్ట్ సంపదవల వ్యత్యాసం ఒక బిలియన్ అమెరికన్ డాలర్లు ఉంది. ఇవాళ స్టాక్ మార్కెట్ల పతనంతో అదానీ సంపద 1.27 బిలియన్ డాలర్లు ఆవిరై 140.20 బిలియన్ డాలర్లకు పడిపోయింది. దాంతో 141.20 బిలియన్ డాలర్ల సంపద కలిగివున్న బెర్నార్డ్ ఆర్నాల్ట్ రెండో స్థానానికి చేరారు. ఇదిలావుంటే తన సంపదను 259.80 బిలియన్ డాలర్లకు పెంచుకుని టెస్లా మోటార్స్ అధినేత ఎలాన్ మస్క్ మాత్రం అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
కాగా, ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్స్ జాబితాలో ప్రస్తుతం ఎలాన్ మస్క్, బెర్నార్డ్ ఆర్నాల్ట్, గౌతమ్ అదానీ తొలి మూడు స్థానాల్లో ఉండగా.. అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. ఇక రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఈ జాబితాలో 8వ స్థానంలో ఉన్నారు.