న్యూఢిల్లీ, మార్చి 30: పరిశ్రమలకు ప్రధానంగా సరఫరా అయ్యే సహజవాయువు ధరలు రెట్టింపు కానున్నాయి. గ్యాస్ ఉత్పాదక సంస్థల్లో రిలయన్స్ కృష్ణగోదావరి (కేజీ) బేసిన్లో ఉత్పత్తి చేసే గ్యాస్కు ఒక ఎంఎంబీటీయూకు 10 డాలర్ల ధర లభించనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. కేజీ డీ6 బ్లాక్ నుంచి రిలయన్స్, దాని భాగస్వామి బీపీ ఉత్పత్తి చేసే గ్యాస్కు ప్రస్తుతం 6.13 డాలర్ల లభిస్తున్నది. ఓఎన్జీసీ..ముంబై హై, ఇతర క్షేత్రాల్లో ఉత్పత్తి చేసే గ్యాస్ ధర ప్రస్తుత 2.9 డాలర్ల నుంచి రెట్టింపై 5.93 డాలర్లకు చేరుతుందని ఆ వర్గాలు వివరించాయి. దేశంలో ఉత్పత్తయ్యే సహజవాయువు ధరను కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఆరునెలలకు ఓసారి- ఏప్రిల్ 1, అక్టోబర్ 1 తేదీల నుంచి అమలయ్యేలా నిర్ణయిస్తుంది. నిర్ణయ తేదీకి ముందు ఏడాదికాలం ముందు (ఒక త్రైమాసికం మినహా) నుంచి గ్యాస్ మిగులు దేశాలైన అమెరికా, కెనడా, రష్యాల్లో ఉన్న సగటు ధరల ఆధారంగా ఇక్కడి సహజ వాయువు ధరను నిర్దేశిస్తారు. ఈ ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకూ అమల్లో ఉండే ధర ..2021 జనవరి నుంచి 2021 డిసెంబర్ వరకూ ఆయా దేశాల్లో ధర ఆధారంగా నిర్ణయమవుతుంది. ఈ కాలం మధ్య అంతర్జాతీయంగా గ్యాస్ రేట్లు ఆకాశాన్నంటినందున ఇక్కడి ధరలు సైతం ఏప్రిల్ 1 నుంచి పెరగనున్నాయి. 2019 ఏప్రిల్ తర్వాత దేశంలో సహజవాయువు ధరలు పెరగడం ఇదే ప్రథమం.
సహజవాయువు ధర పెరుగుతున్న కారణంగా ఆటోమొబైల్స్లో ఉపయోగించే సీఎన్జీ, పలు నగరాల్లో పైపుల ద్వారా సరఫరా అయ్యే వంటగ్యాస్ ధరలు అధికం కావొచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అలాగే విద్యుదుత్పాదక వ్యయం సైతం పెరుగుతుంది. అయితే గ్యాస్ ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్ వాటా పరిమితంగా ఉన్నందున వినియోగదారులపై పెద్దగా భారం పడబోదు. ఎరువుల ఉత్పత్తి వ్యయం సైతం అధికమవుతుంది. కానీ ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తున్నందున, ఎరువుల ధరలపై కూడా ఈ ప్రభావం పడదు.