Nitin Gadkari | కాలుష్య నియంత్రణపై కేంద్ర జాతీయ రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్బన ఉద్గారాలను తగ్గించడానికి డీజిల్తో నడిచే వాహనాలపై అదనంగా 10 శాతం లెవీ వసూలు చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఆటోమొబైల్ ఇండస్ట్రీ బాడీ ‘సియామ్’ వార్షిక సదస్సులో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ పెరిగిపోతున్న కాలుష్యంతో ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందన్నారు. డీజిల్ ఆధారిత వాహనాల వాడకాన్ని నిరుత్సాహ పర్చాలంటే పన్నులు పెంచాల్సి రావచ్చునన్నారు.
‘డీజిల్ ఇంజిన్ / వాహనాలపై అదనంగా 10 శాతం జీఎస్టీ విధించాలని కేంద్ర ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇదొక్కటే డీజిల్ వాహనాలను వదిలించుకునేందుకు ఉన్న ఏకైక మార్గం’ అని కూడా నితిన్ గడ్కరీ చెప్పారు. డీజిల్ వాహనాలపై పదిశాతం జీఎస్టీ పెంచాలని కేంద్ర ఆర్థిక మంత్రితో సమావేశ షెడ్యూల్ ఖరారైందన్నారు.
సియామ్ సదస్సు తర్వాత నితిన్ గడ్కరీ మాట మార్చారు. డీజిల్ వాహనాలపై జీఎస్టీ పెంచే ప్రతిపాదన ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో లేదని ‘ఎక్స్ (ట్విట్టర్)’ వేదికగా స్పష్టం చేశారు. కర్బన ఉద్గారాలను నియంత్రించడానికి క్లీన్ ఫ్యూయల్ వాడాల్సిన అవసరం ఉందన్నారు. డీజిల్ వాహనాలపై పన్నులు పెంచితే ఆయా వాహనాల విక్రయం కష్టతరం అవుతుందని హచ్చరించారు.
కానీ, దేశంలోని వాణిజ్య వాహనాల్లో అత్యధికం డీజిల్తోనే నడుస్తున్నాయి. మారుతి సుజుకి, హోండా కార్స్ ఇప్పటికే డీజిల్ కార్ల తయారీ నిలిపేశాయి. డీజిల్ కార్ల తయారీ నిలిపేయాలని ఆటోమొబైల్ పరిశ్రమను నితిన్ గడ్కరీ కోరారు. బయోఫ్యూయల్, ఇథనాల్, గ్రీన్ హైడ్రోజన్ తదితర ఆల్టర్నేటివ్ ఇంధన వినియోగంపై ఫోకస్ చేయాలన్నారు.
ప్రస్తుతం అన్ని రకాల వాహనాలపై 28 శాతం జీఎస్టీ వసూలు చేస్తోంది కేంద్రం. వాహనాలను బట్టి 1-22 శాతం అదనపు సెస్ విధిస్తున్నది. ఎస్యూవీ కార్లపై 28 జీఎస్టీతోపాటు 22 శాతం అదనపు సెస్ వసూలు చేస్తున్నది.