Nitin Gadkari | తుక్కు కింద అప్పగించే పాత కార్ల స్థానంలో కొత్త కార్లు కొనుగోలు చేయడానికి వచ్చే వారికి రూ.లక్ష వరకు డిస్కౌంట్లు ఇవ్వాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పిలుపునిచ్చారు. పాత కార్లను తుక్కు తరలించి, కొత్త కార్లు కొనే వారికి జీఎస్టీ తగ్గిస్తామని హామీ ఇచ్చారు. దేశంలోని నగరాల్లో పెరిగిపోతున్న కాలుష్యానికి అడ్డు కట్ట వేయడానికి కాలం చెల్లిన, పాత కార్లు, వాహనాలను తుక్కు కింద తరలించడం ఒక మార్గం అని చెప్పారు. దేశంలో 1.2 కోట్లకు పైగా పాత, కాలుష్య కారక కార్లు తుక్కు కింద తరలించడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. వాటిని తుక్కు కింద తరలించడం వల్ల రీ సైక్లింగ్ ద్వారా రాగి, అల్యూమినియం, ప్లాస్టిక్ తయారీకి ముడి సరుకుగా మారతాయన్నారు.
ఆటో ఇండస్ట్రీ బాడీ `సియామ్` ఆధ్వర్యంలో గురువారం జరిగిన సదస్సులో నితిన్ గడ్కరీ మాట్లాడారు. పాత కార్లు లేదా వాహనాలను తుక్కు కింద మార్చేయడాన్నితమ శాఖ ప్రోత్సహిస్తుందన్నారు. అలా పాత కార్లను తుక్కు కింద మార్చిన వారు కొనుగోలు చేసే కొత్త కార్లు ఇతర వాహనాలపై తక్కువ జీఎస్టీ రేట్లతోపాటు పలు బెనిఫిట్లు అందిస్తామన్నారు.
స్క్రాపేజీ పాలసీ వల్ల ఆటో ఇండస్ట్రీ బిజినెస్ 25-30 శాతం పెరుగుతుందని నితిన్ గడ్కరీ చెప్పారు. ఆటోమొబైల్ సంస్థలు తమ లాభాలను కాపాడుకోండి. కానీ మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా.. పాత కార్లను తుక్కు కింద తరలించిన వారికి సాధ్యమైతే రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకు డిస్కౌంట్లు ఇవ్వమని కోరుతున్నా. చిన్న వెహికల్స్పై మీరు తక్కువ డిస్కౌంట్ ఇవ్వగలరు. ఈ విషయంలో మీ సహకారం చాలా ముఖ్యం` అని అన్నారు.
కాలుష్యాన్ని నివారించడానికి ప్రత్యామ్నాయ ఇంధన వినియోగ వాహనాలను ప్రోత్సహించాలని నితిన్ గడ్కరీ చెప్పారు. కేవలం ప్యాసింజర్ వెహికల్స్తోపాటు త్రీ వీలర్స్, టూ వీలర్స్, బస్సుల వంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్లోనూ ఎలక్ట్రిక్ వెహికిల్స్ను ప్రోత్సహిస్తామన్నారు. పెట్రోల్, డీజిల్ వాహనాల విక్రయాలను నిరుత్సాహ పర్చాలని ఆటో కంపెనీలను కోరారు.