Vistara | ఢిల్లీ నుంచి భువనేశ్వర్ బయలుదేరిన విస్తారా ఎయిర్లైన్స్ విమానం కోసం డీజీసీఏ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఢిల్లీ నుంచి భువనేశ్వర్ బయలుదేరిన ఈ విమానంలో హైడ్రాలిక్ ఫెయిల్యూర్ కావడవంతో తిరిగి ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానం టేకాఫ్ అయ్యే సమయానికి అందులో సుమారు 140 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనపై డీజీసీఏ దర్యాప్తునకు ఆదేశించింది.
ఢిల్లీ నుంచి భువనేశ్వర్ బయలుదేరిన విస్తారా విమానంలోని హైడ్రాలిక్ సిస్టమ్లో సమస్య తలెత్తడంతో తిరిగి ఢిల్లీలో ల్యాండ్ అయ్యేలా చర్యలు తీసుకున్నామని డీజీసీఏ అధికారి ఒకరు చెప్పారు. గతేడాది ఎయిర్ ఇండియాలో విస్తారా ఎయిర్లైన్స్ విలీనం చేస్తున్నట్లు టాటా గ్రూప్ ప్రకటించింది. విస్తారాలో సింగపూర్ ఎయిర్లైన్స్కు కూడా వాటా ఉంది. ఎయిర్ ఇండియాలోనూ సింగపూర్ ఎయిర్లైన్స్కు 25.1 శాతం వాటా కేటాయిస్తారు.
సోమవారం మరో ఘటనలో ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లాల్సిన గో ఫస్ట్ విమానం.. 50 మందికి పైగా ప్రయాణికులు బోర్డింగ్ కాకుండానే బయలుదేరి వెళ్లడం విమర్శలకు తావిచ్చింది. ఆ ప్రయాణికులు షటిల్ బస్సులో బోర్డింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. విమానం సిబ్బంది తప్పిదంపై ప్రయాణికులు సోషల్ మీడియాలో విమర్శల హోరెత్తించారు. గో ఫస్ట్ ఎయిర్ వేస్, పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, పీఎంవోఇండియా తదితరుల ట్విట్టర్ హ్యాండిల్స్కు ట్వీట్ జత చేశారు. బేసిక్ చెక్ లేకుండానే విమానం టేకాఫ్ అవుతుందా? అని ప్రశ్నించారు.