Petrol Price | దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు శుక్రవారం తాజా రికార్డులు నెలకొల్పాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 80 డాలర్లు దాటడంతో దేశీయ కేంద్ర ప్రభుత్వ చమురు సంస్థలు లీటర్ పెట్రోల్పై 25 పైసలు, లీటర్ డీజిల్పై 30 పైసలు పెంచేశాయి. గత ఎనిమిది రోజుల్లో ఆరోసారి డీజిల్ ధర పెరిగింది. దేశంలోనే లీటర్ పెట్రోల్ ధర ఆల్టైం రికార్డు నెలకొల్పింది.
ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.89, ముంబైలో రూ.107.95 పలికింది. ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.90.17, ముంబైలో 97.84 గా ఉంది. ఇక రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు నగరాల్లో లీటర్ డీజిల్ ధర రూ.100 దాటేసింది.
బీజేపీకి రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట కేంద్ర చమురు సంస్థలు ఫ్యూయల్ ధరలు పెంచడం గమనార్హం. జూలై 17 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. మే 4 నుంచి జూలై 17 వరకు లీటర్ పెట్రోల్ ధర రూ.11.44, లీటర్ డీజిల్ ధర రూ.9.14 పెరిగింది. ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ ఐదవ తేదీ మధ్య కేంద్ర చమురు సంస్థలు నాలుగు సార్లు పెట్రోల్, ఏడు సార్లు డీజిల్ ధరలు తగ్గించాయి.