Rs 2000 | మార్కెట్లో చలామణి నుంచి రూ.2000 నోటు ఉపసంహరిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించడంతో.. ఆ నోట్లను వదిలించుకోవడానికి ప్రజలు విభిన్న మార్గాలు అవలంభిస్తున్నారు. ముఖ్యంగా పెట్రోల్ లేదా డీజిల్, బంగారం ఆభరణాలు, ఇంటి సరుకుల కొనుగోళ్లకు రూ.2000 నోట్లు ఖర్చు చేస్తున్నట్లు ‘పబ్లిక్ యాప్’ అనే సంస్థ నిర్వహించిన ఆన్ లైన్ సర్వేలో తేలింది. ప్రజలు సాధ్యమైనంత వరకు తమ బ్యాంకు ఖాతాల్లో కూడా డిపాజిట్ చేయడం ద్వారా రూ.2000కరెన్సీ నోట్లను వదిలించుకుంటున్నారు.
55 శాతం మంది బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయడానికి ప్రణాళిక రూపొందించుకుని అమలు చేస్తున్నారని చెప్పారు. మిగతా వారిలో 23 శాతం మంది ఖర్చు చేసేస్తాం అని, 22 శాతం మంది క్యాష్గా మార్చేసుకుంటామని చెప్పారు. సర్వేలో పాల్గొన్న వారిలో 61 శాతం మంది తాము రూ.2000నోటు మార్పిడికి ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కోలేదన్నారు.
అత్యధికంగా కేరళలో 75 శాతం, ఆంధ్రప్రదేశ్లో 53 శాతం, తమిళనాడులో 50 శాతం నగదు మార్పిడి ప్రక్రియ సజావుగా సాగుతున్నది. నగదు చలామణిలో ఉంటుందని ఆర్బీఐ స్పష్టంగా చెప్పినా.. ఎవరూ రూ.2000కరెన్సీ నోటు తీసుకోవడానికి అంగీకరించడం లేదని 42 శాతం మంది అన్నారు.
గత నెల 23 నుంచి సెప్టెంబర్ నెలాఖరు లోపు రూ.2000 నోట్లు మార్చుకోవడం గానీ, డిపాజిట్ చేయడం గానీ చేయాలని ఆర్బీఐ గడువు విధించిన సంగతి తెలిసిందే. కానీ, ఈ గడువు పెంచాలని 51 శాతం మంది కోరుతున్నారు. అలాగే ఒక రోజు రూ.20 వేల విలువైన నోట్ల మార్పిడికి మాత్రమే అవకాశం ఇవ్వడం సరి కాదని, ఆ పరిమితి పెంచాలని 44 శాతం మంది అభిప్రాయ పడుతున్నారని ‘పబ్లిక్ యాప్’ సర్వేలో పాల్గొన్న వారు చెప్పారు.