హైదరాబాద్, జనవరి 11: కొత్త తరం తయారీ, సేవా రంగాలకు మద్దతిచ్చేందుకు తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సమాఖ్య (ఎఫ్టీసీసీఐ) హైదరాబాద్లో ఓ నైపుణ్య కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చింది. బుధవారం ఈ ‘ఎఫ్టీసీసీఐ పోకర్ణ స్కిల్ సెంటర్’ను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, కళాశాల విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, పోకర్ణ సీఎండీ గౌతమ్ చంద్ జైన్లు కలిసి ప్రారంభించారు. ‘మన రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి కల్పనల్లో కీలకపాత్ర పోషిస్తున్న రంగాల్లో తయారీ ఒకటి. కొత్త తరం డిజిటల్ టెక్నాలజీలతో పరిశ్రమ నిండిపోతున్నది.
నిపుణత, మారుతున్న కాలం దృష్ట్యా తయారీ రంగంలో నైపుణ్యం గల మానవ వనరుల అవసరం అంతకంతకూ పెరుగుతున్నది’ అని ఈ సందర్భంగా జయేశ్ రంజన్ అన్నారు. ఇదిలావుంటే నైపుణ్య బోధనకు సంబంధించి నాలుగు సంస్థలతో ఎఫ్టీసీసీఐ ఎంవోయూలను కుదుర్చుకున్నది. కాగా, ఎఫ్టీసీసీఐ భవనంలోని రెండో అంతస్తులోనే ఈ సెంటర్ను ఏర్పాటు చేశారు. తక్కువ ఖర్చుతో ఏటా 20వేల మంది నిపుణులను తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఓ ప్రకటనలో ఎఫ్టీసీసీఐ తెలిపింది. పరిశ్రమలో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పింది.