Green Hydrogen Mission | భూతాప నివారణ లక్ష్యాలు.. కర్బన రహిత ఇంధనం వాడకం దిశగా జాతి ముందడుగు వేయాల్సి ఉంది. ఇందుకోసం ప్రధాని నరేంద్రమోదీ.. నేషనల్ హైడ్రోజన్ మిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. 2047 నాటికి ఇంధన రంగంలో స్వయంసమ్రుద్ధి సాధించాలని సంకల్పించారు. ఇందుకోసం 13 లక్షల కోట్ల డాలర్లు ఖర్చు చేసేందుకు సిద్ధమని 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోట నుంచి మాట్లాడుతూ చెప్పారు.
నేషనల్ హైడ్రోజన్ మిషన్లో భుజంభుజం కలిపేందుకు బిలియనీర్లు ముకేశ్ అంబానీ, గౌతం ఆదానీ మొదలు దేశీయ ముడి చమురు రిఫైనరీ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీఎల్), విద్యుత్ ఉత్పాదక సంస్థ ఎన్టీపీసీ తదితర సంస్థలు పోటీ పడుతున్నాయి. కర్బన రహిత ఇంధనంగా హైడ్రోజన్ వాడకం దిశగా పరివర్తన సాధించడానికి ప్రణాళికలు ప్రకటించాయి. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు పూర్తయితే కరెన్సీ వర్షం కురుస్తుందని భావిస్తున్నారు.
ప్రపంచ ఇంధన అవసరాలను తీర్చే సామర్థ్యం హైడ్రోజన్కు ఉంది. నాచురల్ గ్యాస్, బయోమాస్, సౌర విద్యుత్, పవన విద్యుత్ వంటి వనరుల ద్వారా పర్యావరణ హిత విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు. దీన్ని కార్లు, ఇండ్లలో, ఇతర అవసరాలకు వాడుకోవచ్చు.
“ప్రపంచ భవిష్యత్ గ్రీన్ హైడ్రోజన్. భారత్ను గ్రీన్ హైడ్రోజన్ న్యూ గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దేందుకు నేషనల్ హైడ్రోజన్ మిషన్ ఏర్పాటు చేస్తున్నా.. భారత్ అతిపెద్ద ఎగుమతి దారు కానుంది” అని ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీన బడ్జెట్ ప్రతిపాదనల్లోనూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొలుత ఈ ప్రతిపాదన చేశారు. రవాణా రంగంతోపాటు కెమికల్స్, ఐరన్, స్టీల్, హీటింగ్, విద్యుత్ తయారీ రంగంలో హైడ్రోజన్ను వాడుకోవచ్చు.
దేశంలోకెల్లా అతిపెద్ద ప్రైవేట్ రిఫైనరీని 2035 నాటికి కర్బన రహిత సంస్థగా తీర్చిదిద్దుతామని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ప్రకటించారు. ముడి చమురు నేచురల్ గ్యాస్ రిఫైనరీని కొనసాగిస్తూనే నూతన టెక్నాలజీలను ఆలింగనం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నామన్నారు. మరో బిలియనీర్ ఆదానీ గ్రూప్ అధినేత గౌతం ఆదానీ.. మైరీ టెస్నిమోంట్ భాగస్వామ్యంతో భారత్లో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులను డెవలప్ చేస్తామన్నారు.
250 మిలియన్ టన్నుల ఆయిల్ రిఫైనరీ సామర్థ్యం గల ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) సైతం ఉత్తరప్రదేశ్లోని మథురలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ నిర్మిస్తామని ప్రకటించింది. రాజస్థాన్లో పవన విద్యుత్ ప్రాజెక్టు కలిగి ఉంది ఐవోసీ. హైడ్రోజన్తో కూడిన కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్ (హెచ్-సీఎన్జీ) తయారీకి అవసరమైన టెక్నాలజీ అభివ్రుద్ధిపై ఐవోసీ ద్రుష్టిని కేంద్రీకరించింది.
దేశంలోనే అతిపెద్ద విద్యుత్ తయారీ సంస్థ ఎన్టీపీసీ.. కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్లోని లేహ్లో తొలి గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ప్రస్తుతం పెట్రోల్ లేదా డీజిల్ వంటి శిలాజ ఇంధనాల నుంచి హైడ్రోజన్ వాడుతున్నారు. 2050 నాటికి నాల్గింట మూడొంతులు సంప్రదాయేతర విద్యుత్, ఎలక్ట్రోలైట్స్ నుంచి వచ్చే పర్యావరణ రహిత హైడ్రోజన్ను ఉత్పత్తి చేస్తారు.