ముంబై : వంద రూపాయల మీల్స్ ఆర్డర్ చేస్తే రెండు మీల్స్ ఫ్రీ అనే ప్రకటన చూసి ముంబై వాసి మోసపోయాడు. క్రెడిట్ కార్డుతో రూ 10 చెల్లించి మిగిలిన రూ 90 ఫుడ్ డెలివరీ అయిన తర్వాత చెల్లించవచ్చని యాడ్లో పేర్కొనడంతో ఆశపడిన బాధితుడు క్రెడిట్ కార్డుపై ఏకంగా రూ లక్ష పోగొట్టుకున్నాడు. బాధితుడు క్రెడిట్ కార్డ్తో తొలుత రూ 10 చెల్లించగా రెండుసార్లు రూ 49,760 కార్డు నుంచి చార్జ్ చేశారు.
జనవరి 19న బాధితుడు ఎన్డీ నంద్ (74) ఫేస్బుక్లో ఈ యాడ్ చూసి మోసపోయాడు. ఆపై ఖర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీపక్ అనే వ్యక్తి తన కాల్ను రిసీవ్ చేసుకుని ఆర్డర్ ఇచ్చేందుకు తన క్రెడిట్ కార్డు వివరాలు కోరాడని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆర్డర్ కంప్లీట్ చేసేందుకు తన మొబైల్ ఫోన్కు వచ్చిన ఓటీపీ చెప్పాలని కోరాడని, తాను ఆవిధంగా చేసిన వెంటనే రూ 10 క్రెడిట్ కార్డు నుంచి చెల్లింపు జరిగిందని చెప్పాడు.
ఆ తర్వాత తన క్రెడిట్ కార్డ్ నుంచి అనధికారికంగా రూ 49,760 చొప్పున రెండు సార్లు లావాదేవీలు జరిపారని తెలిపాడు. బాధితుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. క్రెడిట్ కార్డు నుంచి చెల్లింపులు జరిగిన లావాదేవీలతో ఏ ఖాతాకు ఆయా మొత్తాలు క్రెడిట్ అయ్యాయనే వివరాలపై బ్యాంక్ నుంచి సమాచారం కోరామని చెప్పారు.