ముంబై, డిసెంబర్ 21: భారత్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి చేస్తున్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐలు) నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తులు (ఏయూఎం) రికార్డుస్థాయికి చేరుకున్నాయి. డిసెంబర్ ప్రథమార్ధంలో ఎఫ్పీఐల ఈక్విటీ పోర్ట్ఫోలియో తొలిసారిగా 700 బిలియన్ డాలర్ల మార్క్ను దాటి 723 బిలియన్ డాలర్లకు (రూ.60.19 లక్షల కోట్లు) చేరుకుంది. 2021 నవంబర్లో ఎఫ్పీఐల 686 బిలియన్ డాలర్ల ఏయూఎం రికార్డును తాజాగా అధిగమించడం గమనార్హం. డిసెంబర్ తొలి రెండు వారాల్లో విదేశీ ఇన్వెస్టర్లు 5.2 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. 15 రోజుల్లో ఎఫ్పీఐలు ఇంత భారీగా కొనుగోళ్లు చేయడం పదేండ్లలో ఇదే తొలిసారి.
విలువ పెరిగింది..వాటా తగ్గింది
గత రెండేండ్లలో ఎఫ్పీఐల ఆస్తుల విలువ పెరిగినప్పటికీ, భారత్ మొత్తం మార్కెట్ విలువలో ఎఫ్పీఐల వాటా మాత్రం తగ్గింది. 2021 నవంబర్లో 686 బిలియన్ డాలర్ల ఏయూఎం ఉన్న సమయంలో మొత్తం మార్కెట్ విలువలో ఎఫ్పీఐల వాటా 29 శాతంకాగా, ఇప్పుడది 17.6 శాతానికి దిగింది. 2023లో దేశీయ మార్కెట్లోకి విదేశీ ఇన్వెస్టర్లు 20.2 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశారు. ఈ మొత్తం నాలుగేండ్ల గరిష్ఠం. ఒక ఏడాదిలో ఎఫ్పీఐలు భారత మార్కెట్లో 20 బిలియన్ డాలర్లను మించి నిధులు కుమ్మరించడం ఇది నాలుగోసారి. ప్రస్తుత ఏడాది భారత్ ఇతర వర్థమాన దేశాల మార్కెట్లన్నింటికంటే ఎఫ్పీఐల నిధుల్ని ఆకర్షించింది. 2023లో ప్రధాన వర్థమాన మార్కెట్లయిన బ్రెజిల్, దక్షిణ కొరియా, చైనాల్లోకి 8 బిలియన్ డాలర్లు, 8.1 బిలియన్ డాలర్లు, 6.7 బిలియన్ డాలర్ల ఎఫ్పీఐ నిధులు వచ్చాయని బ్లూంబర్గ్ వెల్లడిస్తున్నది.
ఈ రంగాలపై మక్కువ
ప్రస్తుత ఏడాది ఎఫ్పీఐల నిధుల్లో మూడవ వంతు ఫైనాన్షియల్ రంగ షేర్లలోకి తరలివచ్చాయి. తదుపరి 28 శాతం క్యాపిటల్ గూడ్స్, 20 శాతం ఆటోమొబైల్ షేర్లలో పెట్టుబడి చేశారు. ఇదే సమయంలో ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్స్, ఐటీ తదితర రంగాల్లో విక్రయాలు జరిపారు. ఇక ఎఫ్పీఐల ఏయూఎం ఏడాదికాలంలో 24 శాతం వృద్ధిచెందగా, అందులో కన్స్ట్రక్షన్, కన్స్ట్రక్షన్ మెటీరియల్, క్యాపిటల్ గూడ్స్, రియల్టీ షేర్ల విలువ అత్యధికంగా 73 శాతం పెరిగింది. ఎఫ్పీఐల పోర్ట్ఫోలియోలో ఇన్ఫ్రా స్టాక్స్ వెయిటేజి రికార్డుస్థాయి 10.3 శాతానికి చేరింది. ఫైనాన్షియల్ సర్వీసులు, ఆటోమొబైల్స్, ఎఫ్ఎంసీజీ రంగాల వెయిటేజి సైతం రికార్డుస్థాయికి చేరింది.