Foxconn-Vedanta | దేశీయ కార్పొరేట్ దిగ్గజం ‘వేదాంత (Vedanta)’తో జాయింట్ వెంచర్ నుంచి వైదొలుగుతున్నట్లు తైవాన్ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఫాక్స్ కాన్ (Foxconn) ప్రకటించింది. 19.5 బిలియన్ డాలర్ల పెట్టుబడితో భారత్లో సెమీ కండక్టర్ చిప్లను తయారు చేయడానికి రెండు సంస్థలు జట్టు కట్టాయి. కానీ ఈ రెండు సంస్థలకు సెమీ కండక్టర్ చిప్ల తయారీలో అనుభవం లేదు. అయితే, దేశీయంగా సెమీ కండక్టర్ చిప్ల తయారీపై ఎటువంటి ప్రభావం ఉండబోదని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.
దేశంలో సెమీ కండక్టర్ చిప్ల తయారీ సంస్థ ఏర్పాటు చేయడానికి ఫాక్స్ కాన్ (Foxconn), వేదంతా ((Vedanta) గతేడాది సెప్టెంబర్లో జాయింట్ వెంచర్ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో సెమీ కండక్టర్, డిస్ ప్లే ప్రొడక్షన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని తలపెట్టాయి. రెండు సంస్థలకూ సెమీ కండక్టర్ల తయారీపై అనుభవం లేకపోవడంతో వీటి జాయింట్ వెంచర్ మనుగడ ప్రశ్నార్థకమేనని గత మే నెలలో వార్తలొచ్చాయి.
లైసెన్సింగ్ టెక్నాలజీ కోసం ఎస్టీ మైక్రోతో జత కట్టాలని వేదాంత-ఫాక్స్ కాన్ (Foxconn-Vedanta) భావించాయి. కానీ, తాము యూరోపియన్ కంపెనీ భాగస్వామ్యానికి ప్రాతినిధ్యం కల్పించాలని భావిస్తున్నట్లు కేంద్రం చెప్పింది.
మరోవైపు, భారత్లో సెమీ కండక్టర్ చిప్ల తయారీకి ఫాక్స్ కాన్ తో జత కట్టామని నిబంధనలను ఉల్లంఘిస్తూ పత్రికా ప్రకటన చేసిన వేదాంత (Vedanta)పై గత నెలలో సెబీ ఫైన్ విధించింది. వేదాంత (Vedanta), ఫాక్స్ కాన్ మధ్య జాయింట్ వెంచర్ రద్దయినా.. దేశంలో సెమీ కండక్టర్ల తయారీకి కట్టుబడి ఉన్నామని వేదాంత (Vedanta) ప్రకటించింది. మరోవైపు, ఈ రంగంలో పని చేసేందుకు రెండు సంస్థలూ వేర్వేరు సంస్థలతో భాగస్వామ్యానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.