న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: డాలర్ తుఫాన్కు భారత్ విదేశీ మారకం ‘గొడుగు’ ఎగిరిపోతున్నది. ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా తట్టుకోవడానికి మనకు బలమైన ఫారిన్ కరెన్సీ గొడుగు ఉన్నదంటూ రిజర్వ్బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్దాస్ చెప్పిన కొద్దివారాలకే వేగంగా డాలర్లు తరిగిపోతున్నాయి. ఆర్బీఐ శుక్రవారం విడుదల చేసిన వారాంతపు గణాంకాల ప్రకారం సెప్టెంబర్ 9తో మొదలై, 16తో ముగిసిన వారంలో దేశం వద్దనున్న విదేశీ మారకం నిల్వలు 5.22 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.33,363 కోట్లు) తగ్గి 545.65 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఇందులో కరెన్సీ ఆస్తులు అత్యధికంగా 4.70 బిలియన్ డాలర్ల మేర దేశం నుంచి వెలుపలికి వెళ్లిపోయాయి. రూపాయి పతనాన్ని నిరోధించడానికి రిజర్వ్బ్యాంక్ కరెన్సీ నిల్వల నుంచి డాలర్లను యధేఛ్చగా విక్రయించడం ఇందుకు ప్రధాన కారణమని ఫారెక్స్ డీలర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
ముగిసిన వారంలో బంగారం నిల్వలు 458 మిలియన్ డాలర్ల మేర తరిగి 38.19 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. ఈ ఏడాది మార్చి చివరినాటికి 616 బిలియన్ డాలర్లున్న విదేశీ మారక నిల్వలు శరవేగంగా తగ్గిపోయాయి. ఈ క్షీణతకు విదేశీ ఇన్వెస్టర్లు మార్కెట్ నుంచి కొంతమేర నిధుల్ని తరలించుకుపోవడం, క్రూడ్ ధర పెరుగుదలతో దిగుమతులకు డాలర్ల చెల్లింపులు అధికం కావడం ఒక కారణమైతే, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచీ రూపాయిని పటిష్ఠంగా నిలిపేందుకు రిజర్వ్బ్యాంక్..ఫారెక్స్ మార్కెట్లో డాలర్లను విక్రయించడం మరో కారణం. అమెరికా కరెన్సీ బలాన్ని సూచించే డాలర్ ఇండెక్స్ ఈ ఏడాది 16 శాతం ఎగిసింది. ఆ దేశపు కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను భారీ పెంచనున్న సంకేతాలివ్వడంతో రెండు రోజులుగా డాలర్ పెద్ద ర్యాలీ జరుపుతున్నది.
9 నెలల దిగుమతులకు సరి
కరెంటు ఖాతా లోటు (దేశంలోకి వచ్చి, వెళ్లే విదేశీ కరెన్సీ మధ్య వ్యత్యాసం) విపరీతంగా పెరగడంతో పాటు రూపాయి మద్దతుగా ఆర్బీఐ మార్కెట్లో జోక్యం చేసుకుంటున్నందున ఈ ఏడాది భారత్ విదేశీ మారక నిల్వలు మరింత పడిపోతాయని డ్యూషే బ్యాంక్ ఇటీవల హెచ్చరించింది. తాజాగా రూపాయి 81 స్థాయి దిగువకు పడిపోయింది. ప్రస్తుతం దేశం వద్దనున్న విదేశీ మారకపు నిల్వలు 8.9 నెలల దిగుమతులకు సరిపోతాయి. ఈ రిజర్వులతో పోలిస్తే చెల్లింపుచేయాల్సిన స్వల్పకాలిక విదేశీ రుణం నిష్పత్తి 44 శాతంగా ఉంది.
నీళ్లొదిలిన రిజర్వ్ బ్యాంక్
రూపాయి 80 స్థాయి దిగువకు తగ్గకుండా రక్షణగా రెండు నెలల పాటు రిజర్వ్బ్యాంక్ ఎంతో ప్రయత్నించిందని కరెన్సీ డీలర్లు తెలిపారు. ఈ కారణంగానే జూలై, ఆగస్టు నెలల్లో ఇతర ఆసియా కరెన్సీలు పడిపోయినా రూపాయి స్థిరంగా ఉన్నదన్నారు. అయితే తాజాగా ఫెడ్ వడ్డీ రేట్లు ఈ ఏడాది మరో 1.25 శాతం పెరుగుతాయన్న సంకేతాలు వెలువడటంతో రూపాయి పతనాన్ని నిలువరించలేకపోయినట్లు వారు వివరించారు. ఇప్పటికే విదేశీ మారక నిల్వల్లో పదో వంతు రూపాయికి మద్దతుగా ఆర్బీఐ ఖర్చుచేసింది. వేగంగా నిల్వలు తరిగిపోవడంతో రిజర్వ్బ్యాంక్ చేసేదేమీ లేక దేశీ కరెన్సీని స్వేచ్ఛగా వదిలిపెట్టింది. ఫారెక్స్ మార్కెట్లో ఆర్బీఐ ఇంకా జోక్యం చేసుకుంటే డాలర్ నిల్వలు పూర్తిగా హరించుకుపోతాయని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ సీనియర్ ఎకనామిస్ట్ అనుభూతి సహాయ్ చెప్పారు. ఈ ఏడాది క్రూడ్ ధరలు నిలువునా పతనమైతే తప్ప, భారత్ దిగుమతుల బిల్లు గణనీయంగా తగ్గే అవకాశం లేదని, దీంతో ప్రతీ నెలా వాణిజ్యలోటును పూడ్చడానికి 30 బిలియన్ డాలర్ల చొప్పున అవసరమవుతాయని ఆర్థిక వేత్తలు అంటున్నారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఈ డాలర్లను సంపాదించడం సులభమేమీ కాదన్నారు.