న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: ఎల్ఐసీ ఐపీవోలో పాలుపంచుకునేందుకు పలు విదేశీ సావరిన్, వెల్త్ ఫండ్స్ ఆసక్తి చూపిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. యాంకర్ ఇన్వెస్టర్ల ఇష్యూలో పెట్టుబడి పెట్టేందుకు స్థిరమైన, దీర్ఘకాలిక ఇన్వెస్టర్లుగా పరిగణించే సావరిన్ వెల్త్ఫండ్స్ను, పెన్షన్ ఫండ్స్ను ప్రభుత్వం సంప్రదించిందని, ఆయా ఫండ్స్ ఆసక్తిని వ్యక్తం చేసినట్టు ఆ అధికారి వివరించారు. ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, సింగపూర్ ప్రభుత్వానికి చెందిన జీఐసీ, అబుదాబీ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, కెనడాకు చెందిన మూడు పెన్షన్ ఫండ్స్.. ఎల్ఐసీ ఐపీవోలో పెట్టుబడి చేయడానికి ప్రాథమిక ఆసక్తిని చూపించాయని, ఇందుకు సంబంధించి ఆయా సంస్థల ధృవీకరణ కోసం ప్రభుత్వం చూస్తున్నదన్నారు. మరోవైపు ఆయా ఫండ్స్తో మర్చెంట్ బ్యాంకర్లు జరుపుతున్న చర్చలు తుది దశలో ఉన్నాయి. ఐపీవో రోడ్షోల సందర్భంగా దాదాపు 180 యాంకర్ ఇన్వెస్టర్లతో ప్రభుత్వం టచ్లోకి వెళ్లింది. ఇది దేశంలోనే అతిపెద్ద ఐపీవో అయినందున, కనీసం 8 నుంచి 10 భారీ విదేశీ ఫండ్స్.. యాంకర్ ఇన్వెస్టర్లుగా అవసరం ఉంటాయని అధికారులు అంటున్నారు.
ఆఫర్ విలువ 30 శాతం తగ్గింపు?
ఎల్ఐసీ ఐపీవోకు మరింతగా నిధుల్ని ఆకర్షించేందుకు ప్రతిపాదిత పబ్లిక్ ఆఫర్ విలువను 30 శాతం మేర తగ్గించాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్పై రష్యా సైనిక దాడితో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు ఒడిదుడుకులకు లోనుకావడం, వివిధ కేంద్ర బ్యాంక్లు వడ్డీ రేట్లు పెంచాల్సిన పరిస్థితులు ఏర్పడటం, ద్రవ్యోల్బణం పరుగులు తీస్తుండటం వంటి అంశాల నేపథ్యంలో ఐపీవో విలువను తగ్గించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎల్ఐసీ విలువను రూ.16 లక్షల కోట్లుగా గణించి, అందుకు అనుగుణంగా ఐపీవో ధరను నిర్ణయించాలని గతంలో ప్రభుత్వం భావించింది. అయితే మారిన పరిస్థితుల కారణంగా ఈ విలువను 30 శాతం మేర తగ్గించి, రూ.11 లక్షల కోట్లకు కుదించాలని యోచిస్తున్నట్టు ఆ వర్గాలు వివరించాయి. రూ.10.7 లక్షల కోట్ల కంటే తక్కువ విలువతో ఎల్ఐసీ లిస్టయితే ఈ షేరు ఎంఎస్సీఐ ఇండెక్స్లో చేరడం కష్టసాధ్యమవుతుందని, లిస్టింగ్ ధర, మార్కెట్ విలువ ఆ స్థాయిలో ఉండేలా చూడటం కీలకమని అధికారులు వ్యాఖ్యానించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన ఫండ్స్ అన్నీ ఈ ఇండెక్స్ను ట్రాక్ చేస్తుంటాయి. ఎంఎస్సీఐ ఇండెక్స్లో భాగమైన కంపెనీల షేర్లలో విదేశీ పెట్టుబడులు అమితంగా వస్తాయి.
వచ్చే నెల 12కల్లా లిస్టింగ్ పూర్తి
ఎల్ఐసీ బోర్డ్ త్వరలో 2021-22 ఆర్థిక ఫలితాల్ని పరిగణనలోకి తీసుకునేందుకు సమావేశమవుతుందని, వెనువెంటనే సెబీకి సవరించిన పబ్లిక్ ఆఫర్ డాక్యుమెంట్ను సమర్పిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ నెలాఖరులో ఇష్యూ జారీ అయ్యే అవకాశాలున్నాయని, సెబీ నిర్దేశిత గడువు మే 12కల్లా లిస్టింగ్ పూర్తవుతుందని ఆ వర్గాలు వివరించాయి. ఎల్ఐసీలో 5 శాతం వాటాను (31.6 కోట్ల షేర్లు) విక్రయించి, రూ. 63,000 కోట్లు సమీకరించనున్నట్లు ఫిబ్రవరిలో సెబీకి సమర్పించిన రెడ్హెర్రింగ్ ప్రాస్పెక్టస్లో పేర్కొన్నారు. ఆఫర్లో కొంత భాగం యాంకర్ ఇన్వెస్టర్ల కోసం రిజర్వ్ చేయగా, 10 శాతం షేర్లను పాలసీ హోల్డర్ల కోసం రిజర్వ్ చేశారు.