Foreign Direct Investments | న్యూఢిల్లీ, జూలై 21: గత ఆర్థిక సంవత్సరం (2022-23) దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) తగ్గుముఖం పట్టాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2021-22)తో పోల్చితే 22 శాతం క్షీణించి 46 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఈ మేరకు శుక్రవారం రాజ్యసభకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాశ్ లిఖితపూర్వక సమాధానంగా తెలిపారు. కంప్యూటర్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ రంగాలతోపాటు ఆటోమొబైల్ ఇండస్ట్రీకి వచ్చిన ఎఫ్డీఐ గతంతో చూస్తే చాలా తగ్గిపోయిందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.
కాగా, భారతీయ స్టాక్ మార్కెట్లలోకి తెచ్చిన పెట్టుబడులతో కలిపినా గత ఆర్థిక సంవత్సరం వచ్చిన ఎఫ్డీఐ 70.97 బిలియన్ డాలర్లుగానే ఉన్నది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 84.83 బిలియన్ డాలర్లుగా ఉండగా, 16 శాతం పడిపోయినట్టు తేలింది. అయితే ప్రపంచ మాంద్యం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో తలెత్తిన ఆర్థిక సంక్షోభం, సింగపూర్, అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో క్షీణిస్తున్న రియల్ జీడీపీ వృద్ధిరేటే భారత్కు ఎఫ్డీఐలు తగ్గడానికి ప్రధాన కారణాలని ఈ సందర్భంగా మంత్రి పార్లమెంట్లో చెప్పారు. కరోనా తర్వాత చాలా దేశాలు రక్షణాత్మక ధోరణిని అవలంభిస్తుండటం కూడా దేశంలోకి ఎఫ్డీఐల పతనానికి దారితీసినట్టు వివరించారు.