Air India | భారత విమానయాన రంగంపై టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంప్బెల్ విల్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశీయ విమానయాన రంగంలో ఆరోగ్యకరమైన పురోగతి లేదని పేర్కొన్నారు. దేశీయ విమానయాన రంగ భవిష్యత్ మీద నియంత్రణ లేదన్నారు. విదేశీ విమానయాన రంగ సంస్థలు భారత్లోకి రావడంతోపాటు దేశీయంగా పెరుగుతున్న మార్కెట్కు అనుగుణంగా లాభాలు గడిస్తున్నాయని, కానీ భారత విమానయాన సంస్థల పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్యాంప్బెల్ విల్సన్ తేల్చేశారు.
‘గోఫస్ట్’ దివాళా ప్రక్రియ దురదృష్టకరం అని పేర్కొన్న క్యాంప్బెల్ విల్సన్.. ఇదే మొదటి సారి కాదని గుర్తు చేశారు. భారత పౌర విమాన యాన రంగాన్ని తక్కువ చేయడం లేదన్నారు. కానీ నిర్మాణాత్మకంగా, ఆరోగ్యకరంగా లాభదాయక పరిశ్రమగా నిలదొక్కుకోలేకపోతున్నదని పేర్కొన్నారు.
‘మార్కెట్లో మరింత సుస్థిరత సాధించేందుకు అనుమతి లభిస్తుందని ఆశాభావంతో ఉన్నాం. ప్రాఫిటబుల్గా మారితే నూతన ఉత్పత్తుల్లో పెట్టుబడులకు విమానయాన సంస్థలకు అనుమతి ఇవ్వాలని క్యాంప్బెల్ విల్సన్ అన్నారు. అంతే కాదు అంతర్జాతీయ విమానయాన రంగానికి భారత్ సారధ్యం వహించేందుకు అవకాశం ఉందన్నారు. విపత్కర పరిస్థితులు ఉన్నా ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రజలకు సేవలందించడంలో విజయవంతమైందన్నారు.
ఎయిర్ ఇండియా భారీ విస్తరణ ప్రణాళికలకు శ్రీకారం చుట్టారు క్యాంప్బెల్ విల్సన్. 470 కొత్త విమానాల కొనుగోలుకు 70 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు.తద్వారా అంతర్జాతీయంగా కనెక్టివిటీ పెంపునకు మరిన్ని సర్వీసులు అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు.
భారత్ నుంచి పలు దేశాలకు ఎయిర్ ఇండియా.. నాన్ స్టాప్ విమాన సర్వీసులు నిర్వహిస్తున్నది. భారత్ సివిల్ ఏవియేషన్ హబ్ కూడా నిర్మిస్తున్నది. విమాన సర్వీసులకు గిరాకీ ఉన్నా భారత విమాన యాన రంగాలకు ప్రపంచ దేశాలతో తక్కువ కనెక్టివిటీ ఉందని తెలిపారు. విదేశీ విమానయాన సంస్థలతో అనుసంధానమై ఓవర్సీస్ ట్రాఫిక్ సేవలు అందిస్తున్నాయి స్వదేశీ విమానయానసంస్థలు.
మరోవైపు దేశాన్ని ఇంటర్నేషనల్ ఏవియేషన్ హబ్గా డెవలప్ చేయడంపై కేంద్రం కసరత్తు చేస్తున్నది. మరోవైపు ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థలు అంతర్జాతీయంగా తమ సేవల విస్తరణకు చర్యలు తీసుకుంటున్నాయి. అంతర్జాతీయంగా వివిధ దేశాలకు భారత్కు మధ్య నాన్స్టాప్ కనెక్టివిటీ కలిగి ఉండాలన్నదే తమ అభిమతం అని క్యాంప్బెల్ విల్సన్ అభిప్రాయ పడ్డారు.