Ford India | తమిళనాడులోని మరాయిమలాయినగర్ ఫోర్డ్ ప్లాంట్ కార్మికులు మెరుగైన నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసన కొనసాగిస్తున్నారు. భారత్లో ఉత్పత్తి కార్యకలాపాలను పూర్తిగా ఫోర్డ్ నిలిపేసిన సంగతి తెలిసిందే. తమిళనాడు, గుజరాత్ల్లో ఫోర్డ్కు రెండు ప్రొడక్షన్ కేంద్రాలు ఉన్నాయి. గుజరాత్ ఫోర్డ్ యూనిట్ను టాటా మోటార్స్ కొనుగోలు చేసింది. తమిళనాడు యూనిట్లో 2600 మంది కార్మికులు ఉన్నారు. కార్మికుల సర్వీసులో ఏడాదికి 85 రోజుల వేతనం, రూ.42,500 అదనపు పరిహారం చెల్లిస్తామని ఫోర్డ్ యాజమాన్యం ప్రతిపాదించింది. అంతకుముందు 75 రోజుల వేతనం, రూ.20 వేల అదనపు పరిహారం మాత్రమే ఇస్తామని చెప్పింది.
కానీ ఫోర్డ్ ఇండియా కార్మికులు.. ఇతర కార్ల తయారీ సంస్థ ఇచ్చిన పరిహారాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రతి కార్మికుడి సర్వీసుకు అనుగుణంగా ఏటా 135 రోజుల వేతనం పరిహారం చెల్లించడంతోపాటు ఐటీ భారం కూడా సదరు కార్ల తయారీ సంస్థ భరించిందని తెలిపారు. సోమవారం నుంచి ప్లాంట్ లోపలా బయటా నిరసన కొనసాగిస్తున్నారు.
రాష్ట్ర కార్మికశాఖ అధికారి ప్లాంట్ వద్దకు వచ్చి యాజమాన్యంతో సంప్రదింపులు జరుపుకోవాలని తమకు చెప్పారని ఫోర్డ్ కార్మికుల సంఘం నాయకుడు చెప్పారు. ఇది కార్మికులు, యాజమాన్యం మధ్య సమస్య అని, రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి పాత్ర లేదన్నారు. చాలా మంది కార్మికుల వయస్సు మీద పడుతున్న వేళ, కొత్తగా ఉద్యోగ అవకాశాలు లేవని కార్మికులు ఆందోళన చెందుతున్నారు.
ఫోర్డ్ ఇండియా ఎలక్ట్రిక్ కార్ల తయారీ యూనిట్ ప్రారంభించే అవకాశం ఉందని కార్మికులు చెబుతున్నారు. కానీ భారత్లో ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసే ప్రతిపాదనలేవీ లేవని ఫోర్డ్ యాజమాన్యం స్పష్టం చేస్తున్నది. కానీ, తమను పూర్తిగా బయటకు పంపేసిన తర్వాత ఎలక్ట్రిక్ కార్లను యాజమాన్యం తయారు చేస్తుందని కార్మికులు అనుమానిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్లోనే గుజరాత్లోని సనంద్ యూనిట్లో కార్ల ఉత్పత్తిని ఫోర్డ్ నిలిపేసింది. చెన్నైకి సమీపంలోని యూనిట్ ప్రస్తుత త్రైమాసికం ముగిసేనాటికి మూసివేయాల్సి ఉంది.