హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రైతులకు ప్రయోజనం చేకూరాలని, వారు పండించే పంటలకు మరింత ధర లభించాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం నూతన ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ తీసుకొచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ఈ విధానం ద్వారా వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు లభిస్తాయనీ చెప్పారు. శుక్రవారం ఇక్కడ తెలంగాణ పారిశ్రామిక, వాణిజ్య మండళ్ల సమాఖ్య (ఎఫ్టీసీసీఐ) రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ విధానంపై ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలో ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు స్థలాలను గుర్తించిందన్నారు. ప్రతి జోన్లో కోల్డ్ స్టోరేజి సౌకర్యం, నాణ్యతను పరీక్షించే ల్యాబ్లుసహా కనీస వసతుల్ని కల్పిస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో ప్రభుత్వం సాగునీటి వసతుల కల్పనపై దృష్టి సారించిందన్న ఆయన తద్వారానే రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తి గణనీయంగా పెరిగిందన్నారు.
ప్రస్తుతం రైతుల ఉత్పత్తులకు వాల్యూ అడిషన్పై ప్రభుత్వం దృష్టి పెట్టిందని, ఇందులో వ్యాపారవేత్తలు కీలకపాత్ర పొషించాలని ఆయన కోరారు. ఈ క్రమంలో పలువురి వ్యాపారవేత్తల సందేహాలను సోమేశ్ కుమార్ నివృత్తి చేశారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. అయితే గతంలో దరఖాస్తు చేసుకోనివారికి సరైన సమయంలో మరోసారి దరఖాస్తుకు అవకాశం కల్పించే విషయం లో ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందని స్పష్టం చేశారు. కాగా, వ్యాపారవేత్తలకు సబ్సిడీలు, తెలంగాణ సోనా ధాన్యానికి బ్రాండింగ్, రాయితీల్లో భూముల కేటాయింపు, నైపుణ్యం పెంపులో ప్రైవేటు ఏజెన్సీల భాగస్వామ్యం తదితర అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఎఫ్టీసీసీఐ అధ్యక్షుడు భాసర్రెడ్డి, సునీల్ రెడ్డి, అనిల్ అగర్వాల్, అనిల్ కుమార్ గవార్ తదితరులు పాల్గొన్నారు.