హైదరాబాద్, మార్చి 7: ప్రముఖ లాజిస్టిక్ సేవల సంస్థ డెలివరూ..హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఇండియా డెవలప్మెంట్ సెంటర్ను మరింత విస్తరించనున్నట్టు ప్రకటించింది. బ్రిటన్కు చెందిన ఈ లాజిస్టిక్ సేవల సంస్థ సీఈవో విల్ షూ..తొలిసారిగా హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. హైదరాబాద్లో డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి ఏడాది కావడంపట్ల ఆనందం వ్యక్తం చేశారు. బ్రిటన్ బయట నెలకొల్పిన అతిపెద్ద ఐడీసీ సెంటర్ ఇదేనని, గతేడాదికాలంలో ఈ సెంటర్ అంచనాలకుమించి రాణిస్తున్నదన్నారు. ప్రస్తుతం ఈ సెంటర్లో 140 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా.. ఈ ఏడాది చివరినాటికి ఈ సంఖ్యను 200కి పెంచుకోనున్నట్టు ఆయన ప్రకటించారు. భారత్లో వ్యాపార విస్తరణలో భాగంగా భవిష్యత్తులో బెంగళూరు, గుర్గావ్, ముంబైలకు కూడా తమ సేవలను విస్తరించాలనుకుంటున్నట్టు తెలిపారు.
ఫుడ్ డెలివరీ సేవలకు నో
భారత మార్కెట్పై ప్రశంసలు కురిపించిన విల్ షూ.. ఇక్కడ ఫుడ్ డెలివరీ సేవలు ప్రారంభించేది లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇక్కడ సేవలు అందిస్తున్న ఫుడ్ డెలివరీ సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలు ఇందుకు కారణమని తెలుస్తున్నది. 2027 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ డెలివరీ మార్కెట్ 1.4 లక్షల కోట్ల డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేశారు.
‘హైదరాబాద్లో దేశీయ డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభించి ఏడాది అవుతుండటం చాలా సంతోషంగా ఉన్నది. ఇదే క్రమంలో దేశవ్యాప్తంగా వ్యాపారాన్ని మ రింత విస్తరించాలనే సంకల్పంతో ఉన్నాం. ఇందుకోసం ప్రపంచస్థాయి టెక్నికల్ టీం ను నియమించుకోవాలనుకుంటున్నాం’
-విల్ షూ, డెలివరూ సీఈవో, ఫౌండర్