Market Pulse | దేశీయ స్టాక్ మార్కెట్లలో ఒడిదొడుకులు కొనసాగుతున్నాయి. ప్రతికూల పరిణామాల మధ్య మదుపరులు పెట్టుబడుల ఉపసంహరణలకే పెద్దపీట వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అంతకుముందు వారం ముగింపుతో చూస్తే గత వారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 156.61 పాయింట్లు లేదా 0.19 శాతం క్షీణించి 81,224.75 వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 110.20 పాయింట్లు 0.44 శాతం పతనమై 24,854.05 దగ్గర ఆగింది.
ఈ క్రమంలో ఈ వారం కూడా అమ్మకాల ఒత్తిడికే ఎక్కువగా వీలున్నట్టు అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) ద్వితీయ త్రైమాసికానికి (జూలై-సెప్టెంబర్)గాను కార్పొరేట్ కంపెనీలు ప్రకటించే ఆర్థిక ఫలితాలు గత వారం మాదిరే ఈ వారం కూడా మార్కెట్ ట్రేడింగ్ను ప్రభావితం చేయనున్నాయి మరి. అందుకే మదుపరులు అప్రమత్తంగా ఉండాలని, ఇన్వెస్ట్మెంట్లపై ఆచితూచి స్పందించడం ఉత్తమమని మెజారిటీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయం.
ఇక గ్లోబల్ స్టాక్ మార్కెట్లు, విదేశీ సంస్థాగత మదుపరుల పెట్టుబడులు, అంతర్జాతీయ పరిస్థితులు, డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ ఎప్పట్లాగే ఈసారీ భారతీయ స్టాక్ మార్కెట్ల తీరును నిర్దేశించనున్నాయి. సెల్లింగ్ ప్రెషర్ భారీగా ఉంటే నిఫ్టీకి 24,500 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 24,300 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం 25,300-25,500 మధ్యకు వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.
స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఒడిదొడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.