హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నుంచి దేశంలోని ఆయా కొత్త నగరాలకు విమాన సర్వీసులను ఎయిర్ ఇండియా అందుబాటులోకి తెచ్చింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లక్నో, అమృత్సర్, కొచ్చీలకు శుక్రవారం ఫ్లైట్లు మొదలయ్యాయి. అలాగే గ్వాలియర్కు ఈ నెల 28 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్తో వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా జీఎమ్మార్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఈ కొత్త రూట్లకు విమాన సేవల్ని తీసుకురాగలిగింది. కాగా, హైదరాబాద్ నుంచి అమృత్సర్కు వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం రోజూ ఉదయం 7:30 గంటలకు బయలుదేరి 10:15 గంటలకు చేరుకుంటుంది. లక్నోకు మధ్యాహ్నం 2:30 గంటలకు మొదలై సాయంత్రం 4:35 గంటలకు చేరుతుంది. అయితే హైదరాబాద్-లక్నో మధ్య వారానికి ఆరు సర్వీసులే ఉంటాయి.
ఇక కొచ్చీకి రోజూ రాత్రి 7:45 గంటలకు బయలుదేరి 9:30 గంటలకు గమ్యస్థానానికి చేరుతుంది. హైదరాబాద్-గ్వాలియర్ మధ్య వారానికి మూడు సర్వీసులుండనున్నాయి. ఇవి మధ్యాహ్నం 2:30 గంటలకు మొదలై సాయంత్రం 4:20 గంటలకు చేరుతాయి. జీఎమ్మార్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు లిమిటెడ్ సీఈవో ప్రదీప్ పణికర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొత్త మార్గాల్లో విమాన సర్వీసులను ప్రవేశపెట్టడం ఎంతో సంతోషకరమన్నారు. ప్రయాణీకుల కోసం టెర్మినల్ విస్తరణ, అదనపు సౌకర్యాలను చేపట్టామన్నారు. కాగా, ఈ కొత్త సర్వీసులతో హైదరాబాద్ ఎయిర్పోర్టు నుంచి దేశంలోని 19 ప్రాంతాలకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు నడుస్తున్నట్టు అవుతున్నదని చెప్పారు.