Real Estate | రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశాన్నంటుతున్నా యి. దేశంలో ఎక్కడ చూసినా ట్రెండ్ ఇలానే ఉంది. హైదరాబాద్ విషయానికే వస్తే.. అపార్ట్మెంట్లలో ఫ్లాట్ ధర ఒక్కో చదరపు అడుగు సగటున రూ.6,500-7,000 మధ్య పలుకుతున్నది. గత ఏడాదితో పోల్చితే ధరలు కనిష్ఠంగా 15 శాతం నుంచి గరిష్ఠంగా 25 శాతం వరకూ పెరిగినట్టు లెక్కలు చెప్తున్నాయి. మరోవైపు ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గించేందుకు తటపటాయిస్తూనే ఉన్నది. వీటన్నిటి నడుమ వేచిచూసే ధోరణి.. సొంతింటి కలను కలగానే మిగిల్చేలా ఉన్నది. ప్రతీ ఒక్కరి జీవితంలో సొంతిల్లు అనేది ఓ పెద్ద కలే మరి. అయితే రియల్ ఎస్టేట్ మార్కెట్లో చోటుచేసుకుంటున్న అనూహ్య మార్పులు.. సామాన్యులకు ఈ కలను అంతకంతకూ దూరం చేస్తూనే ఉన్నాయి. ఆశల పల్లకిలో ఊరేగే మధ్యతరగతి వర్గాలైతే.. ధరలు దిగివస్తాయ్, రుణాలపై వడ్డీరేట్లు తగ్గుతాయ్ అన్న అంచనాల్లోనే ఉండిపోతున్నాయి. కానీ ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ను చూస్తే.. ఇదంత ఈజీ కాదని చెప్పకనే చెప్తున్నది. ద్రవ్యోల్బణానికి బ్రేకులు పడితేనే వడ్డీరేట్లు తగ్గిస్తామని ఆర్బీఐ మొండికేసి కూర్చున్నది మరి. దీంతో అటు ఇండ్ల రేట్లు, ఇటు గృహ రుణాలపై వడ్డీరేట్లు క్రమేణా భారంగా మారుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారుడు వెయిట్ అండ్ వాచ్ మోడ్లోనే ఉంటే లాభం కన్నా నష్టమే ఎక్కువ.
గత పదేండ్లలో..
గడిచిన దాదాపు పదేండ్లలో నాటి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, కల్పించిన మౌలిక వసతులు.. రియల్ ఎస్టేట్ను ముఖ్యంగా హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాల మార్కెట్ను పరుగులు పెట్టించాయి. దీంతో గత ఏడాదితో పోల్చితే ధరలు ఏకంగా 24 శాతం పెరిగినట్టు తేలింది.
రేట్లు తగ్గుతాయా..?
రియల్ ఎస్టేట్ ధరలు మున్ముందు కొంతమేర తగ్గుతాయనుకునేవాళ్ల సంఖ్య ఉన్నా.. నిజానికి అది కష్టమనేది ఇండస్ట్రీ మాట. కరోనా తర్వాత లేబర్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయింది. దీనికితోడు సిమెంట్, స్టీల్సహా ఇతర బిల్డింగ్ మెటీరియల్ రేట్లూ భారీగా పెరిగాయి. అలాగే రెరా, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వంటి నిబంధనలూ ఇండ్ల ధరలను మరింతగా పెంచుతున్నాయి. డీవియేషన్లకు ఆస్కారం ఉండకపోవడంతో ఆ భారాన్ని కొనుగోలుదార్లే భరించాల్సి వస్తోంది. అందుకే మార్జిన్ల విషయంలో బిల్డర్లు కూడా వెనక్కి తగ్గడం లేదు. మార్జిన్స్ తక్కువగా ఉన్నా.. వాల్యూమ్స్ ఎక్కువగా ఉన్నాయనే ఉద్దేశంతోనే వ్యాపారాలను చేస్తున్నామనేది వాళ్ల వాదన. అందుకే ఇక్కడే కాదు.. దేశవ్యాప్తంగా రేట్లు పెరిగే ఆస్కారమే ఎక్కువగా ఉన్నది.
నాగేంద్రసాయి కుందవరంకుదిరితే కొనండి..
వడ్డీరేట్లు తగ్గినప్పుడు కొందాం.. ఇండ్లు, ఫ్లాట్ల ధరలు పడిపోయినప్పుడు ఆలోచిద్దాం.. అనుకుంటూపోతే ఇక మన సొంతింటి కల కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉందనేది నిపుణుల మాట. ఎందుకంటే నిర్మాణ వ్యయాలు పెరిగిపోయిన తరుణంలో ఆగినకొద్దీ ఎప్పటికైనా అధిక ధర పెట్టే కొనాల్సి ఉంటుంది. ఈ ఏడాది రూ.50 లక్షలకు కొనే ఫ్లాట్ను.. వచ్చే ఏడాది రూ.55-58 లక్షలు పెట్టి కొనాల్సి ఉంటుందని లెక్కలు చెప్తున్నాయి. ఆర్బీఐ వడ్డీరేట్ల గురించి ఆలోచించే పరిస్థితి కూడా ఇప్పుడు లేదు. మనం తీసుకునే హోమ్ లోన్ 20 ఏండ్లకు తక్కువ కాకుండా ఉంటుంది. ఈ సుదీర్ఘ కాలంలో ఇంట్రెస్ట్ రేట్లు పెరగడం, తగ్గడమనేది సాధారణంగా జరిగే ప్రక్రియే. ఏడాది కాలంలో వడ్డీరేట్లు 2.50 శాతం పెరిగాయి. అందులో ఎంతోకొంత క్రమపద్ధతిలో రాబోయే కాలంలో తగ్గుతాయి. అలాగే మళ్లీ పెరగడమూ ఉంటుంది. కాబట్టి ఆలస్యం.. అమృతం.. విషం అన్నట్టు, కుదిరితే ఏదో ఓ ఇంటిని కొనుక్కోవడమే ఉత్తమం.