Electric Vehicles Costly | దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు.. బైక్లు.. కార్లు పిరమయ్యే సంకేతాలొస్తున్నాయి. ప్రస్తుత ధరలతో పోలిస్తే ఈవీ స్కూటర్ ధర సుమారు 10 శాతం పెరుగొచ్చునని భావిస్తున్నారు. ఇటీవల వెలుగు చూసిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో అగ్ని ప్రమాదాలు సంభవించాయి. ఈవీ స్కూటర్లలో వాడే లిథియం అయాన్ బ్యాటరీల తయారీకి తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర నిపుణుల కమిటీ కొన్ని సూచనలు చేసింది. ఆ సూచనలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీలో అదనపు సేఫ్టీ స్టాండర్డ్స్ పాటించాలని స్పష్టం చేసింది. దీనివల్ల ఈవీ బ్యాటరీల తయారీ ధర.. అటుపై ఈవీ స్కూటర్ ధర పెరుగడానికి దారి తీస్తుంది.
ఎలక్ట్రిక్ వెహికల్స్లో వినియోగించే లిథియం-అయాన్ బ్యాటరీలో కొన్ని అదనపు సేఫ్టీ స్టాండర్డ్స్ పాటించాలని కేంద్రం సూచించింది. ప్రత్యేకించి బ్యాటరీ యాజమాన్య వ్యవస్థ, ఆన్బోర్డ్ చార్జర్, బ్యాటరీ ప్యాక్ డిజైన్, ఇంటర్నల్ సెల్ షార్ట్ సర్క్యూట్ జరక్కుండా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ప్రభుత్వ సూచలను పాటించడం వల్ల ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. దాంతోపాటు బ్యాటరీ ధరలూ పెరుగుతాయంటున్నారు.
ఎలక్ట్రిక్ వాహనాల ధరలో దాదాపు సగం బ్యాటరీ ధరే ఉంటుంది కనుక అదనపు సేఫ్టీ ప్రమాణాలు పాటించాలంటే ఆ బ్యాటరీ ధర.. దాంతోపాటు వాహనం ధర పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం సూచించిన అదనపు భద్రతా ప్రమాణాలు పాటించడానికి తక్కువ టైం ఇచ్చారని ఆటోమొబైల్ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రతి బ్యాటరీ సెల్ తయారు చేసిన తేదీ గుర్తించడం కష్టం అని ఆయా వాహనాల తయారీ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇప్పటికైతే కొన్ని ఆటోమొబైల్ సంస్థలు మాత్రమే సొంతంగా లిథియం అయాన్ బ్యాటరీలు తయారు చేస్తున్నాయి. మిగతా సంస్థలన్నీ థర్డ్ పార్టీ బ్యాటరీలను వినియోగిస్తున్నాయి. ఒకవేళ అదనపు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేసే బ్యాటరీలతోపాటు వాహనాల ధరలు పెరిగితే.. వినియోగదారులు ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు చేయడానికి వెనుకడుగు వేయొచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.