న్యూఢిల్లీ, డిసెంబర్ 3: ప్రతీ భారతీయుడి ఆర్థిక సాధికారత కోసం దేశంలో ఫైనాన్షియల్ టెక్నాలజీ (ఫిన్టెక్) విప్లవం రావాల్సిన అవసరం ఉన్నదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఫిన్టెక్ పరిశ్రమ నేడు అందరికీ చేరువైందన్న మోదీ.. ఈ ఫిన్టెక్ సేవలు మరింత విస్తరించి ఫినెటెక్ విప్లవంగా మారాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. శుక్రవారం ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ నిర్వహించిన ఇన్ఫినిటి ఫోరం ప్రారంభం సందర్భంగా మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థలో వచ్చిన సాంకేతిక మార్పులు ఆహ్వానించదగినవన్న మోదీ.. గతేడాది ఏటీఎం నగదు ఉపసంహరణలను మొబైల్ చెల్లింపులు మించిపోయాయని గుర్తుచేశారు. బ్యాంకింగ్ రంగంలో భౌతిక సేవల కంటే డిజిటల్ సేవల వినియోగం ఎక్కువైందని పేర్కొన్న మోదీ.. డిజిటల్ ఇండియా సాకారంలో ఫిన్టెక్ విప్లవం కీలకమన్నారు. నేడు ఎటువంటి లావాదేవీనైనా ఇంట్లో కూర్చునే ఇంటర్నెట్ సాయంతో మొబైల్ నుంచి పూర్తి చేయగలుగుతుండటం సంతోషకరమన్నారు.
అంతా ఏకం కావాలి
రోజురోజుకూ మారుతున్న టెక్నాలజీ, పెరుగుతున్న డిజిటల్ చెల్లింపులను సమర్థవంతంగా నియంత్రించడానికి అన్ని దేశాలు కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉన్నదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇన్ఫినిటి ఫోరం కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. డాటాను ఓ ఆదాయ వనరుగా చూస్తున్నప్పుడు, దాని నియంత్రణ సమష్ఠి కృషితోనే సాధ్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం క్రిప్టోకరెన్సీల రెగ్యులేషన్ చట్టాన్ని తీసుకొస్తున్న వేళ మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.
క్రిప్టో బిల్లుకు ముకేశ్ జై
భారత అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముకేశ్ అంబానీ.. క్రిప్టోకరెన్సీ బిల్లుకు జై కొట్టారు. ప్రతిపాదిత డాటా ప్రైవసీ బిల్లుకూ మద్దతిచ్చారు. ప్రైవసీ ప్రతి ఒక్కరి హక్కు అన్నారు. దేశంలో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం, రక్షణ బాధ్యత కేంద్రానికి ఉంటుందన్న అంబానీ.. డిజిటల్ సమాచారం నిల్వ, పంచుకోవడంపై కఠిన నిబంధనల్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇన్ఫినిటి ఫోరం కార్యక్రమానికి హాజరై మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో క్రిప్టోకరెన్సీ బిల్లు ఆవశ్యకత ఉందన్నారు. బ్లాక్చైన్ టెక్నాలజీని తాను విశ్వసిస్తానని చెప్పిన ముకేశ్.. క్రిప్టోకరెన్సీకి ఇది భిన్నమని స్పష్టం చేశారు. సమసమాజ నిర్మాణానికి బ్లాక్చైన్ టెక్నాలజీ ముఖ్యమన్నారు.