న్యూఢిల్లీ, డిసెంబర్ 25: ఫిన్టెక్ దిగ్గజం పేటీఎం ఏకంగా వెయ్యి మందికిపైగా ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. కృత్రిమ మేధస్సు (ఏఐ) టెక్నాలజీని ప్రవేశపెట్టడం, వ్యయ నియంత్రణ దిశగా వెళ్తుండటంతో సేల్స్, ఇంజినీరింగ్ తదితర విభాగాల నుంచి పెద్ద ఎత్తున సిబ్బందిని సంస్థ తీసేసింది. ‘మరింత ప్రభావవంతమైన కార్యకలాపాల కోసం మేము ఏఐ ఆధారిత ఆటోమేషన్కు బదిలీ అవుతున్నాం. దీనివల్ల ఆపరేషన్స్, మార్కెటింగ్ల్లో మా సిబ్బంది సంఖ్య కొద్దిమేర తగ్గుతున్నది.
మేము ఆశించిన దానికంటే ఏఐతో పని సంతృప్తికరంగా ఉంటున్నది. 10-15 శాతం ఉద్యోగ ఖర్చుల్ని ఆదా చేయగలమనే భావిస్తున్నాం. పనితీరు బాగాలేని వారందర్నీ క్రమేణా తొలగిస్తాం’ అని పేటీఎం అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. కాగా, 2021లోనూ పేటీఎం 500 నుంచి 700 మంది పనితీరు బాగాలేని ఉద్యోగులను బయటకు పంపాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికిగాను రూ.292 కోట్ల నష్టాలను సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే.