కొత్త ఆర్థిక సంవత్సరం (New financial year) మొదలైంది. నూతన లక్ష్యాలు, స్పష్టమైన ప్రణాళికలు తయారు చేసుకునేందుకు ఇదే సరైన సమయం. పన్ను ప్రణాళిక విషయంలో అనూహ్యమైన మార్పులు ఈ ఏడాది నుంచే వచ్చాయి. ఒకప్పటి మాదిరి ఏదో ఒకటి అనుకునే రోజులు కావివిమరి ట్యాక్స్ ఇక లేదని, పొదుపు అవసరం రాదనే ఉద్దేశంతో కొన్ని అంశాలపై అశ్రద్ధవహిస్తే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అందుకే ఈ ఆర్థిక సంవత్సరానికి ఎలాంటి ప్లానింగ్ చేసుకోవాలో చూద్దాం.
ట్యాక్స్ ప్లానింగ్
కొత్త, పాత పన్నుల విధానం.. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి మరింత ప్రభావవంతంగా అమల్లోకి రాబోతోంది. ఇది అంతకుముందు నుంచే ఉన్నప్పటికీ ఈసారి కొత్త స్కీంను డిఫాల్ట్గా మార్చడం, శ్లాబుల్లో మార్పుల కారణంగా ఎక్కువ ప్రాధాన్యత ఏర్పడుతున్నది. రూ.7 లక్షల వార్షిక ఆదాయం వరకూ ఎలాంటి పన్నూ చెల్లించాల్సి రాకపోవడం కొత్త విధానంలోకి మారడం వల్ల వచ్చే ప్రయోజనం. కొత్త విధానంలోకి మారినవాళ్లు ఎలాంటి డిడక్షన్స్ (సెక్షన్ 80సి వంటివి) పొందేందుకు వీల్లేదన్నది గుర్తుంచుకోవాలి. ఈ నేపథ్యంలో మీకు కొత్త పన్ను విధానం లాభమో.. పాతదే నయమో చూసుకుని ప్లానింగ్ రెడీ చేసుకోండి. అవసరాన్నిబట్టి నిపుణుల సలహా తీసుకోవడంలో ఏమాత్రం మొహమాటపడొద్దు. ఇక జీవిత బీమా, ఆరోగ్య బీమా అనేవి ముఖ్యమైన ఖర్చులు. ఎట్టి పరిస్థితు
ల్లోనూ వీటిని ఆపవద్దు. కష్టకాలంలో మనకూ, మన కుటుంబానికి ఆసరాగా నిలిచేవి ఇవే.రుణ భారాన్ని తగ్గించుకోండిఆర్బీఐ మరోసారి కనీసం పావు శాతం వడ్డీరేట్లు పెంచుతుందనేది మార్కెట్ టాక్. అయితే ఇప్పటికే రెండున్నర శాతం వరకూ పెరిగిన వడ్డీరేట్లతో అందరిపైనా చాలా భారం పడుతున్నది. అందుకే ఏదైనా బోనస్గానీ, పెద్ద మొత్తంలో డబ్బులుగానీ అందితే.. రుణ భారాన్ని తగ్గించుకోండి. హౌజింగ్ లోన్ ఉంటే ప్రిన్సిపుల్ అమౌంట్ను తీర్చేయండి.
ఉద్యోగాలు పోతున్నాయ్ జాగ్రత్త..
ప్రపంచవ్యాప్తంగా మాంద్యం భయాలు నానాటికీ పెరుగుతున్నాయి. అమెరికా బ్యాంకింగ్ సంక్షోభం కూడా భయపెడుతున్నది. మహామహా కంపెనీలే ఉద్యోగులను తీసేస్తున్నాయిప్పుడు. కాబట్టి జాగ్రత్త అవసరం. వీలైతే కనీసం 4-5 నెలలకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ను ఏర్పాటు చేసుకోవడానికి మొదటి ప్రాధాన్యతనివ్వండి. ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు ఇది పనికొస్తుంది. వెంటనే వినియోగించుకునేలా ఈ ఫండ్ను పెట్టుబడుల్లో పెట్టండి.
ఫిక్స్డ్ డిపాజిట్లు
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇప్పుడు మార్కెట్లో 8-9 శాతం వడ్డీనిస్తున్నాయి. మీ దగ్గర మిగులు నగదు నిల్వలుంటే బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) చేయండి. డెట్ మ్యూచువల్ ఫండ్స్ కూడా మంచి ప్రయోజనాన్ని ఇస్తున్నాయనేది గమనించండి.
బంగారం
ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో కొద్ది మొత్తాన్ని బంగారంలో పెట్టుబడి పెట్టే ఆలోచన చేయండి. రూ.100 పొదుపు చేస్తుంటే.. అందులో గోల్డ్కు కనీసం రూ.5-10 వరకైనా కేటాయించండి. ఈటీఎఫ్లు, డిజిటల్ గోల్డ్, ఆర్బీఐ సావరిన్ బాండ్స్ పరిశీలించండి.
చివరగా..
ఆర్థిక సంవత్సరం ఆరంభంలో చేసుకునే ప్లానింగ్ ఎప్పుడూ పటిష్టంగా ఉంటుంది. అందుకే పక్కా బడ్జెట్తో, ఖర్చులను నియంత్రణలో ఉంచుకుంటూ, దీర్ఘకాల పొదుపు లక్ష్యాలకు ప్రాధాన్యతనిస్తూ ముందుకెళ్లడం సర్వదా లాభదాయకం.
–నాగేంద్ర సాయి కుందవరం
పొదుపునకు పెద్దపీట
మన నిర్ణయాలు దీర్ఘకాల ఆర్థిక, పొదుపు ప్రణాళికలకు విఘాతం కలిగేలా ఉండకూడదు. సంపాదనలో కనీసం 30 శాతాన్ని పొదుపు చేయండి. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్స్, బంగారం.. ఇలా సాధనం ఏదైనా మన లక్ష్యంలో మాత్రం మార్పులు ఉండకూడదు. ముఖ్యంగా పిల్లల చదువుల కోసం ఎడ్యుకేషనల్ ప్లానింగ్, ఆడపిల్లలుంటే బంగారం కొనుగోళ్లు, పెండ్లి, రిటైర్మెంట్ ప్లానింగ్ వంటివి ఎప్పటికీ మన మైండ్లో ఫిక్స్ అయిపోవాల్సిన లక్ష్యాలు. ఇందుకోసం నేషనల్ పెన్షన్ స్కీం, సుకన్య సమృద్ధి, పోస్టాఫీస్ పథకాలు, హైబ్రిడ్ ఫండ్స్.. ఇలా ఏ మార్గాన్ని ఎంచుకున్నా.. అందులో రిస్క్ ఎంత?.., రివార్డ్ ఎంత?.. అనే అంశంపై క్లారిటీ వచ్చిన తర్వాతే ముందుకు సాగండి.