న్యూఢిల్లీ, జనవరి 25: సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)ని మెరుగుపర్చేందుకు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కలిసి చురుగ్గా పనిచేస్తున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలోనూ దీన్ని వియోగించుకోవచ్చని ఇక్కడ జరిగిన హిందూ కళాశాల 125 ఏండ్ల వేడుకలో పాల్గొన్న మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. దీంతో భారత్, ఇతర దేశాల మధ్య రెమిటెన్స్ రాకపోకల వ్యయం తగ్గుతుందని, చెల్లింపుల ప్రక్రియ కూడా సులభమవుతుందన్న ఆశాభావాన్ని వెలిబుచ్చారు. కాగా, హోల్సేల్ సీబీడీసీ పైలట్ ప్రాజెక్ట్ కోసం ఆర్బీఐ ఇప్పటికే 9 బ్యాంకులను గుర్తించింది.
ఎస్బీఐ, బీవోబీ, యూబీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, కొటక్ మహీంద్రా, యెస్, ఐడీఎఫ్సీ, హెచ్ఎస్బీసీ అందులో ఉన్నాయి. అలాగే 2022 డిసెంబర్ 1నే సీబీడీసీ రిటైల్ వెర్షన్ లేదా ఈ-రూపీలో ఓ పైలట్ ప్రాజెక్ట్ను అమల్లోకి తెచ్చింది. దీంతో డిజిటల్ టోకెన్ రూపంలో ఈ-రూపీ లీగల్ టెండర్ను సూచిస్తున్నది. ప్రస్తుతం చలామణిలో ఉన్న కరెన్సీ నోట్లు, నాణేలతో సమానంగా వీటి జారీ ఉన్నది. ఈ ప్రాజెక్టులో భాగమైన ఆయా బ్యాంకులందించే డిజిటల్ వ్యాలెట్ ద్వారా ఈ-రూపీతో కస్టమర్లు లావాదేవీలనూ చేసుకోవచ్చు.