Nirmala on Adani Group | హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదికతో కుప్పకూలిన అదానీ గ్రూప్ స్టాక్స్ తాజా ట్రేడింగ్పై నియంత్రణ సంస్థలు విధించిన ఆంక్షలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానాలు దాట వేశారు. స్టాక్స్లో అదానీ గ్రూప్ ఫ్రాడ్ చేసిందన్న ఆరోపణల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లలో ఆ గ్రూప్ లిస్టెడ్ కంపెనీలు అసాధారణ పతనాన్ని నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే. అదానీ గ్రూప్ మోసాలపై నియంత్రణ సంస్థలు తీసుకునే చర్యలు తీసుకోనివ్వండంటూ నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
`నియంత్రణ సంస్థలు వాటి పని అవి చేస్తాయి. నిన్న రిజర్వుబ్యాంక్ ఏం చెప్పిందో మీరు విన్నారు. దీంతోపాటు అదానీ గ్రూప్ సంస్థల్లో వాటాలు, రుణాలు ప్రమాదకరస్థాయిలో లేవని బ్యాంకులు, ఎల్ఐసీ ప్రకటించాయి` అని శనివారం ముంబైలో మీడియాతో చెప్పారు. `ఆర్థిక, బ్యాంకింగ్, స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థలు ప్రభుత్వాధీనంలో స్వయం ప్రతిపత్తి గల సంస్థలు. కీలకమైన సమయంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఆ సంస్థలకే వదిలేద్దాం. స్టాక్ మార్కెట్లలో పరిస్థితులను చక్కదిద్దేందుకు స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తగిన చర్యలు తీసుకుంటుందన్నారు.
అమెరికా షార్ట్ షెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలతో అదానీ గ్రూప్ షేర్లు పతనం అవుతున్నాయి. అదానీ గ్రూప్ పెట్టుబడికి స్వర్గధామాలుగా ఉన్న దేశాల్లో చట్టాల దుర్వినియోగం, స్టాక్స్లో అవకతవకలకు పాల్పడుతున్నదని, ఆస్తులను మించిన రుణ భారం మోస్తున్నదని హిండెన్బర్గ్ ఆరోపించింది.
తాము భారత ప్రభుత్వ చట్టాలకు లోబడే వ్యవహరిస్తున్నామని, హిండెన్బర్గ్ నివేదిక నిరాధారం అని అదానీ గ్రూప్ వివరణ ఇచ్చినా ఉపయోగం లేకపోయింది. అదానీ గ్రూప్లోని ఏడు లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 100 బిలియన్ డాలర్లకు పైగా (దాదాపు గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో సగం) హరించుకుపోయింది. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్కు చెందిన కొన్ని షేర్ల ట్రేడింగ్పై ఎన్ఎస్ఈ ఆంక్షలు విధించింది. ఎన్ఎస్ఈ ఆంక్షలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానాలు దాటేశారు.