హైదరాబాద్, ఏప్రిల్ 20 : ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్(ఎఫ్ఐఈవో) ఆధ్వర్యంలో ఎగుమతుల్లో అవకాశాలు, ఎలా ప్రారంభించాలనే అనే అంశంపై ఈ నెల 23 నుంచి 24 వరకు హైదరాబాద్లో రెండు రోజుల పాటు ప్రత్యేకంగా సదస్సును నిర్వహించబోతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో విజయం సాధించడానికి అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలతో పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లు, ఎగుమతిదారులు, వ్యాపార సంస్థలను సన్నద్ధం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు ఎఫ్ఐఈవో వర్గాలు వెల్లడించారు.
ఈ సదస్సులో పాల్గొనేవారికి ఎగుమతి వ్యాపారం ఎలా ప్రారంభించడం, విధానాలు, డాక్యుమెంటేషన్, నిబంధనల పాటింపు, వాణిజ్య ఫైనాన్స్, జీఎస్టీ, ఎగుమతి ప్రోత్సాహకాలు, ఉత్పత్తి, మార్కెట్ ఎంపిక, విదేశీ కొనుగోలుదారులు గుర్తించడం, ఎఫ్టీఏలు, ఇటీవల ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిణామాలు, క్రెడిట్ రిస్క్ మేనేజ్మెంట్ వంటి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే బ్యాంకింగ్ ప్రతినిధులు, ఈసీజీసీ, గ్లోబల్ మార్కెట్లోవున్న అవకాశాలపై కూడా చర్చించనున్నారు.