న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ అనంతరం రికవరీ నిలకడగా సాగడంతో 2021-22 ఆర్ధిక సంవత్సరంలో భారత్ జీడీపీ 9.1 శాతం వృద్ధి సాధిస్తుందని పరిశ్రమ సంస్ధ ఫిక్కీ అంచనా వేసింది. ప్రస్తుత పండుగ సీజన్ దేశ వృద్ధి రేటుకు ఊతమిస్తుందని ఫిక్కీ ఎకనమిక్ అవుట్లుక్ సర్వే స్పష్టం చేసింది. దీపావళి పండగతో ప్రజల రాకపోకలతో కొవిడ్-19 కేసులు మరోసారి పెరుగుతాయని, దీని పట్ల అప్రమత్తత అవసరమని ఫిక్కీ నివేదిక పేర్కొంది.
ఈ ఏడాది జులైలో నిర్వహించిన ఫిక్కీ సర్వేలో 9 శాతంగా వృద్ధి రేటును అంచనా వేసిన పరిశ్రమ సంస్ధ తాజా సర్వేలో వృద్ధి రేటు అంచనాను స్వల్పంగా పెంచడం విశేషం. రుతుపవనాలు ఆశాజనకంగా సాగడం, ఖరీఫ్ సాగు పెరగడంతో వ్యవసాయ రంగంలో ఉత్తేజం నెలకొంటుందని ఫిక్కీ నివేదిక పేర్కొంది. రెండో త్రైమాసిక జీడీపీ డేటా, రానున్న పండగ సీజన్ భారత ఆర్ధిక వ్యవస్ధ రికవరీకి బాటలు పరిచాయనే సంకేతాలు వెల్లడిస్తున్నాయని తెలిపింది.