ముంబై, జనవరి 5: దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలు టాప్గేర్లో దూసుకుపోతున్నాయి. గరిష్ఠ స్థాయిలోనే ఇంధన ధరలు కొనసాగుతుండటంతో ఈవీల వైపు కొనుగోలు దారులు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా గత కొన్నేండ్లుగా దేశీయ రోడ్లపై టాప్గేర్లో దూసుకుపోయిన పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో ఈవీలు రాజ్యమేలుతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల అత్యధికంగా ఈవీలు తిరుగుతున్నాయి. వచ్చే పదేండ్లకాలంలో సగటున 35 శాతం వృద్ధితో ఈవీల విక్రయాలు 2.72 కోట్లకు చేరుకోనున్నట్లు ఓ సర్వే అంచనావేస్తున్నది. ‘ఇండియన్ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ ఓవర్వ్యూ 2023’ పేరుతో విడుదల చేసిన నివేదికలో కస్టమైజ్డ్ ఎనర్జీ సొల్యుషన్స్ పేర్కొంది. 2023లో దేశీయంగా 17 లక్షల వాహనాలు అమ్ముడయ్యాయి.
ఈవీల కోసం ప్రత్యేక స్కీం
ఈవీలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఫేమ్ స్కీంలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలి విడుత విడుదల చేసిన ఫేమ్-1 స్కీం కింద కొనుగోలు చేసే వాహనాలపై భారీగా రాయితీ ఇచ్చిన విషయం తెలిసిందే. రెండో విడుత కూడా రాయితీల్లో కోత విధించినప్పటికీ అమ్మకాలు మాత్రం దూసుకుపోయాయి. గత కొన్నేండ్లుగా సరాసరిగా రెండంకెల వృద్ధిని నమోదు చేసుకుంటున్నాయని, ఇదే క్రమంలో 2032 నాటికి 35 శాతం వృద్ధితో 2.72 కోట్ల విక్రయాలు జరగనున్నాయని నివేదిక అంచనావేస్తున్నది. ఈవీలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 1.2 బిలియన్ డాలర్లను సబ్సిడీల రూపంలో అందచేసింది. అలాగే 3.5 బిలియన్ డాలర్లతో ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటీవ్(పీఎల్ఐ) స్కీంను కూడా తీసుకొచ్చింది. ఈవీలను తయారు చేస్తున్న ఆటోమొబైల్ సంస్థలు, విడిభాగాలు తీర్చిదిద్దుతున్న సంస్థలకు ఆర్థిక సహాయం అందించేందుకోసం ఈ స్కీంను అందుబాటులో తీసుకొచ్చింది.
రాష్ట్ర ప్రభుత్వాలు సైతం..
కాలుష్యాన్ని నియంత్రించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుంబిగించాయి. ఇప్పటికే పలు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వాలను ఈవీలను ప్రోత్సహించడానికి ప్రత్యేక పాలసీలను సైతం అందుబాటులోకి తీసుకొచ్చాయి కూడా. తెలంగాణతోపాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అడుగుముందుకేసి రాయితీలు కూడా అందిస్తున్నాయి.
‘ఈవీలను ప్రోత్సహించడానికి పాలసీలు, ఆర్థిక రాయితీలతో అమ్మకాలు విరివిగా పెరిగాయి. ప్రత్యేకంగా మౌలిక సదుపాయాలు కల్పించడం, ముఖ్యంగా చార్జింగ్ కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తుండటం విక్రయాలకు దన్నుగా నిలువనున్నాయి.
– రాహుల్ వాలావాల్కర్, ఇండియా ఎనర్జీ స్టోరేజీ ఫౌండర్
టాటా నుంచి 5 ఈవీలు
దేశవ్యాప్తంగా ఈవీలకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో టాటా గ్రూపునకు చెందిన టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మరిన్ని వాహనాలను విడుదల చేయడానికి సిద్ధమైంది. వచ్చే ఏడాదిన్నరలోగా ఐదు నూతన ఉత్పత్తులను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. తన తొలి ఈవీ ఎస్యూవీ పంచ్ ‘యాక్టి-ఈవీ’ రూ.21 వేలు చెల్లించి ముందస్తు బుకింగ్లను సంస్థ శుక్రవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా కంపెనీ చీఫ్ ప్రొడక్ట్స్ అధికారి ఆనంద్ కులకర్ణి మాట్లాడుతూ..ప్రతి మూడు నెలలకొక వాహనం చొప్పున వచ్చే ఏడాదిన్నరలోగా ఐదు నయా ఎలక్ట్రిక్ కార్లను దేశీయ మార్కెట్కు పరిచయం చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. 300 కిలోమీటర్ల నుంచి 600 కిలోమీటర్ల రేంజ్లో వీటిని రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్యూర్ ఈవీ ప్లాట్ఫామ్లో 7.2 కిలోవాట్ల నుంచి 11 కిలోవాట్ల చార్జర్లు కలిగిన మాడళ్లను తయారు చేస్తున్నది.