అమెరికా ద్రవ్యోల్బణం 3 శాతానికి తగ్గడంతో ఫెడ్ ఈ ఏడాది వడ్డీరేట్లు పెద్దగా పెంచకపోవచ్చన్న అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్లు పరుగులు తీశాయి. ఈ నేపథ్యంలో ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం కొత్త గరిష్ఠాలకు చేరి కీలకమైన 19,500 స్థాయిపైన ముగిసింది. డెరివేటివ్ సెటప్లో లాంగ్ బిల్డప్ కన్పిస్తున్నందున, ర్యాలీ కొనసాగే అవకాశం ఉందని యాక్సిస్ సెక్యూరిటీస్ టెక్నికల్ హెడ్ రాజేశ్ పాల్వియా అంచనా వేశారు. గతవారం టీసీఎస్ ఫలితాలు ఇన్వెస్టర్లను ఉత్సాహపర్చగా, ఈ వారం వెల్లడయ్యే హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్ ఫలితాలు మార్కెట్ను స్వల్పకాలికంగా ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు అంటున్నారు.
తదుపరి లక్ష్యం 19,800 ఫిబోనకి లెవల్స్ ప్రకారం 19,500 తర్వాత ఈ వారం 19,800 స్థాయి లక్ష్యంగా నిఫ్టీ కదలవచ్చని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ టెక్నికల్ అనలిస్ట్ నాగరాజ్ షెట్టి చెప్పారు. 19,470 సమీపంలో మద్దతు లభించవచ్చన్నారు. ఈ వారం 19,750-19,800 వరకూ ర్యాలీ కొనసాగవచ్చని, కొద్ది రోజుల్లో 20,000 పాయింట్లను అందుకోవచ్చని రాజేష్ పాల్వియా వివరించారు. నిఫ్టీ 19,720 స్థాయిని అందుకోవచ్చని, 19,300 పాయింట్ల వద్ద స్వల్పకాలిక మద్దతు లభిస్తున్నదని ఎల్కేపీ సెక్యూరిటీస్ సాంకేతిక విశ్లేషకుడు రూపక్ తెలిపారు.