న్యూఢిల్లీ, నవంబర్ 21: పారిశ్రామిక వృద్ధితో ముందంజలో ఉన్న తెలంగాణ రాష్ట్రం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని (ఎఫ్డీఐలు) ఆకర్షించడంలో మొత్తం దేశంలోనే దూసుకెళుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్లో దేశంలోకి తరలివచ్చిన ఎఫ్డీఐ ఈక్విటీ నిధులు డాలర్ల రూపేణా 24 శాతం క్షీణించగా, తెలంగాణలో మాత్రం 21 శాతంపైగా పెరిగాయి.రూపాయిల్లో లెక్కిస్తే రాష్ట్రంలో 27 శాతం వృద్ధిచెందాయి.
ప్రపంచంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వరుస వడ్డీ రేట్ల పెంపు వంటి ప్రతికూలతల్ని అధిగమించి తెలంగాణ ఎఫ్డీఐల ఆకర్షణలో వృద్ధి సాధించడం గమనార్హం. స్వయానా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ అధీనంలోని డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ, ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2023-24 ప్రధమార్థంలో తెలంగాణ రాష్ర్టానికి రూ.9,679 కోట్ల ఎఫ్డీఐలు వచ్చాయి. నిరుడు ఇదేకాలంలో ఆకర్షించిన విదేశీ పెట్టుబడులు రూ.7,578 కోట్లకంటే 27 శాతం వృద్ధిచెందాయి. డాలర్లలో ఇవి 968 మిలియన్ డాలర్ల నుంచి 21.48 శాతం పెరిగి 1,176 మిలియన్ డాలర్లకు చేరినట్టు డీపీఐఐటీ తెలిపింది.
నాలుగేండ్లలో రూ.45 వేల కోట్లు
పరిశ్రమలకు స్నేహపూరిత వాతావరణం కల్పిస్తూ ఉపాధిని పెంచే దృష్టితో సానుకూల వాణిజ్య విధానాల్నితెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేపథ్యంలో 2019 అక్టోబర్ నుంచి 2023 సెప్టెంబర్ వరకూ నాలుగేండ్లలో ఏకంగా రూ.45,445 కోట్ల (5.921 బిలియన్ డాలర్లు) ఎఫ్డీఐ ఈక్విటీ నిధుల్ని రాబట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం ప్రధమార్థంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోని టాప్ 10 రాష్ర్టాల్లో ఒకటైన తెలంగాణతో పాటు మరో రెండు రాష్ర్టాలు మాత్రమే ఎఫ్డీఐలను పెంచుకోగలిగాయి. అవి..పశ్చిమ బెంగాల్, జార్ఖండ్లు. ఇక మహారాష్ట్ర, కర్నాటక, గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ, తమిళనాడు, హర్యానాల్లోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గాయి.
దేశంలోకి 20.48 బిలియన్ డాలర్లే
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్ ప్రధమార్థంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐలు) 24 శాతం క్షీణించి 20.48 బిలియన్ డాలర్లకు తగ్గాయి. కంప్యూటర్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్, టెలికం, ఆటోమొబైల్, ఫార్మా రంగాల్లోకి విదేశీ పెట్టుబడులు మందగించినందున, మొత్తంగా నిధుల ప్రవాహం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం ప్రధమార్థంలో ఇవి 26.91 బిలియన్ డాలర్లు. 2023 జనవరి-మార్చి త్రైమాసికంలో సైతం ఎఫ్డీఐలు 40 శాతం క్షీణించి 9.28 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. ఏప్రిల్-జూన్ మూడు నెలల్లో కూడా 34 శాతం తగ్గి 10.94 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, మే, జూన్, జులై, ఆగస్టు నెలల్లో పడిపోయిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సెప్టెంబర్లో మాత్రం 2022 సెప్టెంబర్తో పోలిస్తే 2.97 బిలియన్ డాలర్ల నుంచి 4.08 బిలియన్ డాలర్లకు పెరిగినట్టు డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ, ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) మంగళవారం విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలల్లో సింగపూర్, మారిషస్, యూఎస్, యూకే, యూఏఈ తదితర ప్రధాన దేశాల నుంచి భారత్కు ఎఫ్డీఐ ప్రవాహం తగ్గింది. నెదర్లాండ్స్, జపాన్, జర్మనీ దేశాల నుంచి మాత్రం పెరిగింది. కంప్యూటర్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ట్రేడింగ్, సర్వీసులు, టెలికమ్యూనికేషన్లు, ఆటోమొబైల్, ఫార్మా, కెమికల్స్ రంగాల్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గగా, నిర్మాణ రంగంలో పెరిగాయి.