‘తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఎందుకు వెనుకంజ వేస్తున్నారు? మిమ్మల్ని ఆపుతున్న శక్తి ఏమిటి? అదేంటో నేను తెలుసుకోవాలనుకొంటున్నా. మీకు ఆత్మవిశ్వాసం లేదా?’-ఎనిమిదేండ్ల కిందట బీజేపీ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన ‘మేకిన్ ఇండియా’ ఘోరంగా విఫలమైందనడానికి గత సెప్టెంబర్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ఈ వ్యాఖ్యలే సాక్ష్యం. ‘మేకిన్ ఇండియా’ స్కీమ్ ఫెయిల్ అయినట్టు తాజాగా మరోసారి రుజువైంది.
– స్పెషల్ టాస్క్ బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టాలంటూ 2014లో ప్రధాని నరేంద్రమోదీ ‘మేకిన్ ఇండియా’ స్కీమ్ను తీసుకొచ్చారు. దేశంలోని తయారీ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) గణనీయంగా పెరిగినట్టు ఎప్పటికప్పుడూ ప్రభుత్వం గప్పాలకు కూడా పోతున్నది. అయితే, ఇదంతా అబద్ధమని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ (ఇండ్-రా) బుధవారం విడుదల చేసిన నివేదికతో తేటతెల్లమైంది. గడిచిన 8 ఏండ్లలో అంటే 2014 ఏప్రిల్ నుంచి 2022 మార్చి మధ్య తయారీ రంగంలో రూ. 78.15 లక్షల కోట్ల ఎఫ్డీఐలు వచ్చాయి.
ఇదే సమయంలో సేవారంగంలో 126.78 లక్షల కోట్లు (62 శాతం ఎక్కువ) లభించాయి. ఇక, 2000 ఏప్రిల్ నుంచి 2014 మార్చి మధ్య తయారీరంగంలో 63.89 లక్షల కోట్ల ఎఫ్డీఐలు రాగా.. సేవారంగంలో రూ. 66.71 లక్షల కోట్లు వచ్చాయి. అంటే 2000-2014 మధ్య తయారీ, సేవారంగానికి దాదాపుగా ఒకేస్థాయిలో ఎఫ్డీఐలు రాగా, బీజేపీహయాంలో వీటిమధ్య అంతరం ఏకంగా 62 శాతంగా ఉన్నది. దీన్ని విశ్లేషిస్తే, ‘మేకిన్ ఇండియా’ అంటూ ప్రభుత్వం పెద్దయెత్తున ప్రచారం చేసినప్పటికీ, తయారీరంగంలో ఎఫ్డీఐల పెట్టుబడుల పెరుగుదల రేటు సాపేక్షంగా తగ్గినట్లు అర్థమవుతున్నది.
కారణాలు అనేకం
తయారీరంగంతో పోలిస్తే సేవారంగంలో సంక్లిష్టతలు తక్కువగా ఉండటమే ఆ రంగంలో ఎఫ్డీఐల ప్రవాహానికి కారణంగా ఇండ్-రా అంచనా వేసింది. అయితే, తయారీ, ఉత్పాదక రంగాల్లో పెట్టుబడులు క్షీణించడానికి కేంద్రం తీసుకొంటున్న అసంబద్ధ నిర్ణయాలే కారణమని ఆర్థికవేత్తలు ఆరోపిస్తున్నారు. పెన్సిళ్ల దగ్గర నుంచి దుస్తులు, ప్రాసెసర్ల తయారీ వరకూ జీఎస్టీ పేరిట ఎడాపెడా పన్నులు విధించడం, ముడి సరుకుపై దిగుమతి సుంకాలను పెంచడం, దీర్ఘకాలిక ప్రయోజనాలను పట్టించుకోకుండా హడావుడిగా నిర్ణయాలు తీసుకోవడమే తయారీ రంగంలో ఎఫ్డీఐల క్షీణతకు కారణంగా వాళ్లు చెబుతున్నారు. ఈ ఏడాది జూలైలో తయారీరంగం వృద్ధి 10 నెలల కనిష్ఠానికి పడిపోవడమే దీనికి నిదర్శనంగా వెల్లడిస్తున్నారు.
మోదీ.. మేకిన్ ఇండియా హామీలు ఏమయ్యాయి?
హామీ 1: తయారీ రంగం వృద్ధి 12-14 శాతానికి పెంచడం
ప్రస్తుతం: 6 శాతం కూడా దాటట్లేదు
హామీ 2: జీడీపీలో తయారీరంగం వాటాను 25 శాతానికి పెంచడం
ప్రస్తుతం: 16 శాతం వద్దే స్థిరపడింది
హామీ 3: తయారీరంగంలో 10 కోట్ల ఉద్యోగాల కల్పన
ప్రస్తుతం: కొత్త ఉద్యోగాలు కాదు.. సగం మంది ఉద్యోగాలు మటాష్
బీజేపీపాలిత రాష్ర్టాలకే..
తయారీరంగంలో వస్తున్న కొద్ది మోతాదు ఎఫ్డీఐలు కూడా బీజేపీ పాలిత రాష్ర్టాల్లోని మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలకే వెళ్తుండటం గమనార్హం. 2019 అక్టోబర్ నుంచి 2022 మార్చి మధ్యలో వచ్చిన మొత్తం ఎఫ్డీఐలలో 70.5 శాతం వాటా మహారాష్ట్ర (27.5 శాతం), కర్ణాటక (23.9 శాతం), గుజరాత్ (19.1 శాతం) రాష్ర్టాలకే లభించడం గమనార్హం.
ప్రచారం చేసినా.. గిట్టుబాటు కాలే
“మేకిన్ ఇండియా’ పేరిట తయారీరంగంలో పెట్టుబడులు పెట్టాలంటూ బీజేపీ ప్రభుత్వం పెద్దయెత్తున ప్రచారం చేసినప్పటికీ, ఎఫ్డీఐల ప్రవాహం సేవారంగం వైపే మొగ్గుచూపింది.’
-ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్