న్యూఢిల్లీ, ఆగస్టు 28: విదేశీ పెట్టుబడులు ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది భారత్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికమైన ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో దేశంలోకి 22.53 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐలు) వచ్చాయి. గతేడాది ఇదేకాలంలో వచ్చిన 11.84 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఈ జూన్ క్వార్టర్లో రెట్టింపుకావడం గమనార్హం. పాలసీల్లో సంస్కరణలు తీసుకురావడం, సులభతర వాణిజ్యంలో తీసుకొచ్చిన మార్పులు ఇందుకు దోహ దం చేస్తున్నాయి.
ఆటోమొబైల్లోకి అత్యధికం
విదేశీ పెట్టుబడులు ఆకట్టుకోవడంలో ఆటోమొబైల్ రంగం అగ్రస్థానంలో నిలిచింది. కరోనా నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుండటం, వాహన విక్రయాలు టాప్గేర్లో దూసుకుపోతుండటం ఎఫ్డీఐలు ఆకట్టుకోవడానికి ప్రధాన కారణమని విశ్లేషించింది. ఇందులో ఈక్విటీగా వచ్చిన ఎఫ్డీఐలు 6.56 బిలియన్ డాలర్ల నుంచి 17.57 బిలియన్ డాలర్లకు పెరిగినట్లు శనివారం విడుదలైన అధికారిక ప్రకటన తెలిపింది. అత్యధికంగా 27 శాతం ఈక్విటీ ఎఫ్డీఐలు ఆటోమొబైల్ రంగంలోకి రాగా, సాఫ్ట్వేర్ రంగం 17 శాతం, సర్వీసుల రంగం 11 శాతం చొప్పున పెట్టుబడుల్ని ఆకర్షించాయి. రాష్ర్టాల వారీగా చూస్తే ఎఫ్డీఐలు ఆకట్టుకోవడంలో కర్ణాటక తొలి స్థానంలో నిలిచింది. దేశంలోకి వచ్చిన మొత్తం ఎఫ్డీఐల్లో కర్ణాటకలోకి 48 శాతం రావడం గమనార్హం. మహారాష్ట్రలోకి 23 శాతం, ఢిల్లీ 11 శాతం వచ్చాయి. కేంద్రం తీసుకొచ్చిన పలు సంస్కరణలు, ముఖ్యంగా పలు రంగాల్లోకి ఎఫ్డీఐల పరిమితి పెంచడం, సులభతర వాణిజ్య విధానంలో మార్పులు ఇందుకు దోహదం చేశాయని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.