Fastag Records | దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై టోల్ గేట్ల వద్ద ఫాస్టాగ్పై ఫీజు వసూళ్లలో రికార్డు ఆదాయం లభించింది. 2017-18తో పోలిస్తే 2022-23లో 58 శాతానికి పైగా టోల్ ఫీజు వసూలు పెరిగింది. 2017-18లో ఫాస్టాగ్ అమలు చేసినా రూ.21,948 కోట్ల టోల్ ఫీజు మాత్రమే వసూలైంది. నాటికి 16 శాతం వాహనాల యజమానులు మాత్రమే ఫాస్టాగ్ చెల్లింపులు జరిపేవారు. కానీ, ఫాస్టాగ్ తప్పనిసరి చేసిన తర్వాత 2021-22లో రూ.34,778 కోట్ల టోల్ ఫీజు వసూలైంది. 2021-22 నాటికి 96 శాతం వాహనాలు ఫాస్టాగ్ పరిధిలోకి వచ్చాయి. తత్ఫలితంగా టోల్ ఫీజు వసూళ్లు 2022-23లో రూ.50,855 కోట్లకు చేరుకున్నాయి.
దేశవ్యాప్తంగా గరిష్టంగా రాజస్థాన్లో 104 టోల్ గేట్లు ఉంటే, ఉత్తరప్రదేశ్లో అధిక టోల్ ఫీజు వసూలైంది. 2022లో ఉత్తరప్రదేశ్లోని 90 టోల్ గేట్ల ద్వారా రూ.3,949 కోట్ల ఆదాయం లభించింది. రాజస్థాన్లో స్వల్పంగా తగ్గి రూ.3,491 కోట్లకు పరిమితమైంది. గతంలో ఒక వాహనం టోల్ గేట్ దాటడానికి ఎనిమిది నిమిషాలు పడితే, ఫాస్టాగ్ అమల్లోకి వచ్చాక 47 సెకన్ల టైం మాత్రమే పడుతున్నది.
ఇప్పుడు ఆ టైం మరింత తగ్గించేందుకు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ వ్యవస్థ (ఏఎన్పీఆర్)ను తేవాలని భావిస్తున్నది. ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ వ్యవస్థ వల్ల టైం వృధా కాదు. ఏ వాహనం కూడా టోల్ గేట్ వద్ద నిలుపాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ప్రయోగాత్మకంగా ఢిల్లీ-మీరట్ రూట్లో ఏఎన్పీఆర్ ప్రాజెక్టు అమలు చేస్తున్నది కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ. జీపీఎస్ ఆధారిత టోల్ సిస్టమ్ కూడా కేంద్రం పరిశీలనలో ఉంది.
ఏఎన్పీఆర్ వ్యవస్థను అమల్లోకి తేవడం ద్వారా టోల్ వసూళ్లు మూడింతలు పెరుగుతుందని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ తెలిపింది. వార్షిక టోల్ ఫీజు వసూళ్లు రూ.1.5 లక్షల కోట్లకు చేరుతుందని పేర్కొంది. దేశవ్యాప్తంగా భారత జాతీయ రహదారుల సంస్థ ఆధీనంలో 865 టోల్ ప్లాజాలు ఉన్నాయి. అత్యధికంగా రాజస్థాన్లో 104, ఉత్తరప్రదేశ్లో 90, మధ్యప్రదేశ్లో 66, ఆంధ్రప్రదేశ్లో 65, మహారాష్ట్రలో 64, తమిళనాడులో 54 టోల్ ప్లాజాలు పని చేస్తున్నాయి.