న్యూఢిల్లీ, జనవరి 30: ప్రముఖ ఫర్నీచర్ రిటైలర్ ఐకియా.. మార్కెట్ విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నది. ఈ క్రమంలోనే ఆయా రాష్ర్టాల్లో 62 చోట్ల డోర్స్టెప్ డెలివరీ సౌకర్యాలను పరిచయం చేసింది. ఇందులో తెలంగాణతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రాంతాలున్నాయి. సమీప ఐకియా స్టోర్ల నుంచి కస్టమర్ల ఇంటి వద్దకు సర్వీసులుంటాయి. దీనివల్ల కస్టమర్లకు ఎంతో సమయం ఆదా అవుతుందని, ఖర్చులూ కలిసొస్తాయని ఐకియా చెప్తున్నది.
ప్రస్తుతం ఐకియా ఇండియా అమ్మకాల్లో దాదాపు 25 శాతం ఆన్లైన్ వేదికగానే జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇది మరింతగా పెరుగుతుందని సంస్థ బలంగా విశ్వసిస్తున్నది. ఈ నేపథ్యంలో ఫోన్ అసిస్టెన్స్ సర్వీస్ ద్వారా షాపింగ్ వెసులుబాటునూ కల్పించబోతున్నట్టు సంస్థ సీఈవో సుసన్నే పుల్వేరర్ పీటీఐకి తెలిపారు. కాగా, తీరికలేని ఈ యాంత్రిక జీవనంలో షాపింగ్ కోసం అదనంగా మరింత సమయాన్ని వెచ్చించకుండా, ట్రాఫిక్ కష్టాలను తప్పించుకునేలా ఆన్లైన్ షాపింగ్కు పెద్దపీట వేస్తున్నట్టు సుసన్నే చెప్పారు. అలాగే భౌతిక స్టోర్లనూ పెంచుకుంటూ ముందుకెళ్తామన్నారు.