న్యూఢిల్లీ, అక్టోబర్ 20: ఎప్పటికప్పుడు కొత్త లోతుల్ని చూస్తున్న రూపాయి విలువ మరింతగా క్షీణిస్తుందని, ఈ ఏడాది చివరికల్లా 85 స్థాయికి దిగజారుతుందని ఆర్థికవేత్తలు, బ్యాంకింగ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ సంవత్సరం మిగిలిన రెండు నెలల్లో అమెరికా డాలర్ మారకంలో రూపాయి పతనం కొనసాగుతుందని గురువారం రాయిటర్స్ నిర్వహించిన సర్వే తేల్చిచెప్పింది. సర్వేలో 14మంది బ్యాంకర్లు, ఫారిన్ ఎక్సేంజ్ అడ్వయిజర్లు పాల్గొన్నారు. ఇప్పటికే గత తొమ్మిదేండ్లలో ఎన్నడూ లేనంతగా 2022లో రూపాయి 11.75 శాతం దిగజారింది. 2013లో జరిగిన 11 శాతం పతనం తర్వాత ఇదే రికార్డు క్షీణత. డిసెంబర్కల్లా 85 స్థాయికి రూపాయి పడిపోతుందని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకానమిస్ట్ మదన్ సబ్నవీస్ అంచనా వేశారు. వచ్చే రెండు నెలల్లో అంతర్జాతీయ పరిస్థితుల్లో మార్పేదీ ఉండదని, డాలర్ బలపడుతూనే ఉంటుందని, మన దేశీ ఫండమెంటల్స్ బలహీనంగానే ఉంటాయన్నారు. భారత్ కరెంట్ ఖాతా లోటు జీడీపీలో 3-3.5 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నామన్నారు. ఈ ఏడాది రూపాయి కోలుకునే అవకాశం లేదని, 83.25 స్థాయి నుంచి 86 స్థాయివరకూ తగ్గవచ్చని సర్వేలో పాలుపంచుకున్న బ్యాంకర్లు అంచనా వేశారు.
83.29 స్థాయి నుంచి స్వల్ప రికవరీ
గురువారం రూపాయి మారకపు విలువ మరో కొత్త కనిష్ఠస్థాయి 83.29 వద్దకు పతనమై, ట్రేడింగ్ ముగింపులో కోలుకుంది. చివరకు 82.79 వద్ద ముగిసింది. క్రితం రోజుతో పోలిస్తే 21 పైసలు లాభపడింది.