న్యూఢిల్లీ, నవంబర్ 28: వాహన విక్రయాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. కస్టమర్లు ఎగబడి కొనుగోళ్లు జరపడంతో ఈ ఏడాది పండుగ సీజన్లో అత్యధికంగా అమ్ముడయ్యాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్డీలర్స్ అసోసియేషన్(ఫాడా) తాజాగా వెల్లడించింది. అన్ని సెగ్మెంట్లకు చెందిన వాహనాలకు డిమాండ్ అధికంగా ఉండటం ఇందుకు దోహదం చేశాయని ఫాడా వర్గాలు వెల్లడించాయి. 42 రోజులపాటు సాగిన ఈ పండుగ సీజన్లో 37,93,584 యూనిట్ల వాహనాలు అమ్ముడయ్యాయి.
ఏడాది క్రితం ఇదే సమయంలో అమ్ముడైన 31,95,213 యూనిట్లతో పోలిస్తే 19 శాతం అధికమని పేర్కొంది. నవరాత్రి సందర్భంగా తొలి రోజు ప్రారంభమైన పండుగ సీజన్ ధంతేరస్ తర్వాత 15 రోజులకు ముగిసింది. వీటిలో 5,47,246 ప్యాసింజర్ వాహనాలు ఉన్నాయి. ఏడాది క్రితం ఇదే సమయంలో అమ్ముడైన 4,96,047 యూనిట్ల కంటే ఇది పది శాతం అధికం కావడం విశేషం. ఈసారి పండుగ సీజన్ అక్టోబర్ 15 నుంచి నవంబర్ 25 వరకు కొనసాగింది.
నవరాత్రి సీజన్లో ప్యాసింజర్ వాహన విక్రయాలు అంతంతే ఉన్నప్పటికీ దీపావళి నాటికి భారీగా పెరిగాయి. ఈ సీజన్లో మిగతావాటితో పోలిస్తే స్పోర్ట్ యుటిలిటీ వాహనాలకు అత్యధికంగా డిమాండ్ నెలకొన్నది. ప్యాసింజర్ వాహనాల ఇన్వెంటరీలు ఇంకా గరిష్ఠ స్థాయిలోనే కొనసాగుతున్నాయి. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలకు డిమాండ్ ఉండటం కలిసొచ్చింది. పండుగ సీజన్ ప్రారంభంలో ట్రాక్టర్ల అమ్మకాలు 8.3 శాతం తగ్గగా, చివర్లో తిరిగి పుంజుకున్నాయి.
– మనీష్ రాజ్ సింఘానియా, ఫాడా ప్రెసిడెంట్